Sunday, September 22, 2024
Homeనేషనల్Jagan letter to PM Modi: టీటీడీ లడ్డూ వ్యవహారంపై ప్రధాని మోదీకి జగన్‌...

Jagan letter to PM Modi: టీటీడీ లడ్డూ వ్యవహారంపై ప్రధాని మోదీకి జగన్‌ లేఖ

ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో వైయస్‌ జగన్‌ పేర్కొన్న అంశాలు:

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులు ఉన్నారు.
ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది.
లేకపోతే చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయి.
భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారి తీస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తైన సందర్భంగా, గొప్పలు చెప్పుకునేందుకు టీడీపీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. కాని కొత్త ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం ప్రతికూలంగా ఉంది.
ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, నిలబెట్టుకోవడంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
ఎన్నికల హామీల విషయంలో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో చంద్రబాబు కనీసం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోయారు. చంద్రబాబు పాలనా సమర్థతపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. దీంట్లో భాగంగా తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు చేరిందని ఆరోపణలు చేశారు. తదుపరి కూడా ఆయన అత్యంత బాధ్యతా రాహిత్యంగా, అవాస్తవాలు చెప్పారు.
కోట్లాది మంది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తప్పుడు ఆరోపణలు చేశారు.
కేవలం రాజకీయ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ ప్రచారం చేశారు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయి.

కల్తీ జరిగిందని ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024, జూలై 12న తిరుమలకు వచ్చాయి. తిరస్కరించిన ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. శతాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. అలా ట్యాంకర్లు వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబునాయుడుగారు బాధ్యతా రాహిత్యంగా, వ్యాఖ్యలు చేశారు. అది కోట్ల మంది తిరుమల భక్తుల్లో ఆవేదనకు ఇది దారి తీసింది.

ఆలయం అవసరాలకు సంబంధించి ఎలాంటి కొనుగోళ్లు జరిపినా వాటి విషయంలో టీటీడీ దశాబ్దాలుగా అత్యుత్తమ విధానాలు అనుసరిస్తోంది. శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయ వ్యవహారాలన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టే చూస్తుంది. ఇది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. తిరుమల ఆలయ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాత్ర పరిమితంగా ఉంటుంది. ధర్మకర్తల మండలిలో భక్తులు, వేర్వేరు రంగాల్లో ఆథ్మాత్మికత నిండిన ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి వారిని టీటీడీ సభ్యులుగా సిఫార్సు చేస్తారు. ప్రస్తుతం ఉన్న టీటీడీ బోర్డులో బీజేపీకి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు.

ఆలయ అవసరాలకు అవసరమైన నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ ఇ–టెండర్‌ ప్రక్రియను అనుసరిస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్‌ పక్రియను చేపడుతుంది. టెండర్‌ పక్రియలో పేర్కొన్న నియమ, నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా సంస్థను ఎంపిక చేస్తుంది. ఆమోదం కోసం టీటీడీ బోర్డు ముందు ఉంచుతారు. టీటీడీలో కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 2014–2019 మధ్య టీడీపీ హయాంలో కూడా అదే పద్ధతి ఉంది. నెయ్యిని వినియోగించే మందు దాని నాణ్యతను పరిశీలించడానికి తనిఖీ వ్యవస్థలు కూడా ఉన్నాయి.
నెయ్యిని ఆలయానికి పంపే ముందు దాని స్వచ్ఛత, నాణ్యతలపై NAAC (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ మరియు కాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌) ద్వారా గుర్తింపు పొందిన ఏజెన్సీల నుంచి తప్పనిసరిగా ధృవీకరణ ఉండాలి. అలాగే ఆలయంలోని వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్‌ నుండి మూడు నమూనాలను తీసుకుని పరీక్షిస్తారు. ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారు.
ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. ఇలాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందు వల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు.
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హాయంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు.
2019–24 మధ్య వైయస్సార్‌సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించడం జరిగింది.
అటువంటి ధృఢమైన విధానాలు మరియు పద్ధతులు అమలులో ఉన్నందున, కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారీకి ఆస్కారమే లేదు. ఈ విధానం గత కొన్ని దశాబ్దాలుగా టీటీడీలో అమలులో ఉంది.
బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబుగారు, టీటీడీలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాల గురించి, టీటీడీ ప్రతిష్ట గురించి ప్రజలకు చెప్పాల్సింది పోయి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.
సామాజిక బాధ్యత లేకుండా చంద్రబాబు వ్యవహరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో, ఆతర్వాత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ట్యాంకర్లను తిరస్కరించిన పద్ధతుల్లో భాగంగానే జులై నెలలో కూడా నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించారు.
తిరస్కరించిన ట్యాంకర్లను ఆధారంగా చేసుకుని 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టీడీపీ రాజకీయ సమావేశంలో చంద్రబాబు సున్నితమైన ఈఅంశంపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ ఉద్దేశాలు ఇట్టే అర్థం అవుతున్నాయి. కచ్చితంగా ఇది నేరం.

NAAC నుంచి వచ్చిన నివేదికలో పేర్కొన్న ఎస్‌– విలువలు నిర్దేశించిన విలువల పరిమితి కన్నా తక్కువ ఉండడంపై ల్యాబ్‌ కొన్ని సందేహాలను కూడా వ్యక్తం చేసింది.
ఏయే పరిస్థితుల్లో ఈ పరీక్షలు తప్పు కావచ్చనే అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది.
తాము ఇచ్చిన రిజల్ట్స్‌ కొన్ని కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లోపించే అవకాశం ఉందని అందులో ఉంది.
పోషకాహార లోపం ఉన్న ఆవులనుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, వెజిటబుల్‌ ఆయిల్స్‌ను ఆహారంగా తీసుకునే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసిన నెయ్యి వల్ల, వేర్వేరు విధానాలతో తీసే నమూనాల వల్ల కచ్చితత్వం లోపిస్తుందని నివేదికలో ఉంది.
పైన పేర్కొన్న పరిస్థితుల్లో ల్యాబ్‌ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తాయని పేర్కొంది.
ఉదాహరణకు, పోషకాహార లోపం ఉన్న ఆవు నుండి వచ్చే పాల నుంచి నెయ్యి పొందినట్లయితే లేదా పామాయిల్‌ అధికంగా తినిపించిన ఆవు పాల నుంచి నెయ్యి పొందినట్లయితే, జంతువు కొవ్వు ఉనికిని సూచించే పరీక్షల్లో కచ్చితత్వంతో సరైన ఫలితాలు కొనుగొనేందుకు అవకాశాలు ఉండవు.
పరీక్షల్లో కచ్చితత్వంపై నిర్ధారణ లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దిగ్భ్రాంతి కలిగించే ఆరోపణలు చేయకూడదు. ప్రజా జీవితంలో తనకు అపారమైన అనుభవం ఉందంటూ పదేపదే గొప్పలు చెప్పుకునే చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీ లాంటి సంస్థ యొక్క అంకిత భావాన్ని, పవిత్రతను, కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బ తీసేందుకు అవకాశం ఉండే ఇలాంటి అంశాలపై తప్పుగా మాట్లాడకూడదు.
ఎన్‌డీడీబీ పరీక్షల నివేదికను ఈ లేఖకు జత చేస్తున్నాను. పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మరొక అంశంలో కూడా టీడీపీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నేళ్లుగా తిరుమలలో కర్ణాటక కో–ఆప్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ నెయ్యి సరఫరా చేసేదని, దాన్ని వైయస్సార్‌సీపీ ప్రభుత్వం నిలిపేసిందని ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇది పూర్తిగా సత్యదూరం..
2014–19 మధ్య టీటీడీ నిర్వహించిన టెండర్లలో కొన్ని సార్లు మాత్రమే టెండర్లలో పాల్గొంది.
వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉన్న 2015 నుంచి 2018 అక్టోబరు వరకు ఓMఊ టీటీడీకి నెయ్యి సరఫరా చేయక పోయకపోవడం గమనార్హం. టెండర్ల ప్రక్రియలో పాల్గొని ఎల్‌–1 ఆధారంగా ఎంపికైన ప్రైవేటు సంస్థలే నెయ్యి సరఫరా చేశాయి.
అలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొన్నిసార్లు కేఎంఎఫ్‌ ద్వారా నెయ్యి సరఫరా జరిగిన సందర్భాలు ఉన్నాయి. నందిని విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. నిజానికి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చేపట్టిన కొన్ని చర్యల పట్ల నేను గర్వపడుతున్నాను. ఆలయంలో వినియోగించే నేయి సహా సరుకుల స్వచ్ఛత, నాణ్యతలపై పరీక్షలు జరపడానికి ప్రయోగశాలలను బలోపేతం చేశాం.
ఈ విషయంలో ప్రఖ్యాత ఇఊఖీఖఐ సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) సేవలను టీటీడీ తీసుకుంది. నవనీత సేవను ప్రారంభించడమే కాదు, శుద్ధ నెయ్యి సరఫరా కోసం తిరుమలలో గోశాలను స్థాపించాం. టీటీడీ అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం.
టీటీడీ ఉద్యోగులకు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాలు అందించాం.
వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జమ్మూలో మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి సమీపంలో టీటీడీ ఆలయాన్ని నిర్మించాం. 2023లో దీన్ని ప్రారంభించామని గుర్తు చేస్తున్నాం.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే. ముంబై, రాయ్‌పూర్‌ మరియు అహ్మదాబాద్‌లలో బాలాజీ కొత్త ఆలయాల నిర్మాణం ప్రారంభించాం.

చంద్రబాబునాయుడుగారి చిత్తశుద్ధి లేని, కపట వైఖరిని చెప్పడానికి మరో అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. 2024 జూలై 12వ తేదీన తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్‌లోని నమూనాలు సందేహాస్పదంగా ఉన్నాయని, మూడు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించ లేకపోయాయని, వాటి నమూనాలను కూడా పంపినట్లు బహిరంగంగా వెల్లడించారు.
తదుపరి ఆ నమూనాలను ల్యాబరేటరీకి జూలై 17, 2024న పంపారు. వాటిని పరిశీలించి, పరీక్షలు చేసి విశ్లేషించిన ఫలితాలను 23 జూలై, 2024న నివేదించారు. నెయ్యి కల్తీ జరిగిందన్న సందేహాలు వ్యక్తమైన ట్యాంకర్లు టీటీడీ ఆవరణలోకే అనుమతించ లేదన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి.

ఏది ఏమైనప్పటికీ చంద్రబాబునాయుడుగారు భక్తుల మనోభావాలను పూర్తిగా పట్టించుకోకుండా రాజకీయ ఉద్దేశాలతో అసత్యాలను ప్రచారం చేశారు. దుర్మార్గపు ఉద్దేశాలతో వ్యవహరించారు.
2024 సెప్టెంబరు 18న జరిగిన రాజకీయ పార్టీ సమావేశంలో ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ట్యాంకర్‌ తిరస్కరించబడిన రెండు నెలల తర్వాత టీడీపీ కార్యాలయం నుంచి ల్యాబ్‌ నివేదిక విడుదల చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను కించపరిచేలా మొత్తం ఈ అంశాన్ని రాజకీయ లక్ష్యాల సాధన కోసం ఉపయోగించుకునేందుకు వేసిన పథకం ఇది. చంద్రబాబుగారి బాద్యతా రాహిత్య వైఖరితో ఇది స్పష్టంగా వెల్లడైంది. ల్యాబ్‌ రిపోర్టు వచ్చిన తర్వాత రెండు నెలలపాటు చంద్రబాబు మౌనంగా ఉన్నారు.
నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదని, ఒకవేళ అలా చేసి ఉంటే నిరంతరంగా జరిగే నాణ్యత, స్వచ్ఛత నిర్ధారణ తనిఖీల్లో అది తేలుతుందనే విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే.. రెండు నెలలపాటు మౌనంగా ఉన్నారు. అందుకనే తదుపరి చంద్రబాబు చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యం, పచ్చి అబద్ధం. కేవలం రాజకీయ లక్ష్యాల కోసం చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారు.

చంద్రబాబుగారు ఒక అబద్ధాల కోరు. అబద్ధాలు చెప్పడం అతనికి అలవాటు.
కేవలం రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను తీవ్రంగా దెబ్బ తీసేలా దిగజారారు.
ఆయన చర్యలు నిజానికి ముఖ్యమంత్రి స్థాయిని మాత్రమే కాకుండా ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థాయిని దిగజార్చాయి. ప్రపంచ ప్రఖ్యాత టీటీడీకి, టీటీడీ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బ తీశాయి.

ఇలాంటి కీలక సమయంలో దేశం మొత్తం మీవైపు చూస్తోంది. అబద్ధాలను వ్యాప్తి చేసేలా సిగ్గు లేని రీతిలో నడుచుకున్న చంద్రబాబునాయుడును తీవ్రంగా మందలించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు నిజానిజాలను వెలుగులోకి తీసుకు రావడం అత్యవసరం. కోట్లాది మంది హిందూ భక్తుల మదిలో చంద్రబాబునాయుడు సృష్టించిన అనుమానాలను నివృతి చేయడంతో పాటు, ఖీఖీఈ పవిత్రతపై భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది సహాయపడుతుంది.
ధన్యవాదాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News