Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Jagan: ఆత్మస్థుతి.. పరనింద.. జగన్ తీరే ఇంతనా?

CM Jagan: ఆత్మస్థుతి.. పరనింద.. జగన్ తీరే ఇంతనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విపక్షాలపై విమర్శల విషయంలో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటారు. అయితే ఆ విమర్శలన్నీ విపక్షాలకు కాకుండా నేరుగా తన పార్టీకీ, తన పార్టీ నేతలకూ తగులుతుంటాయన్న సంగతిని ఉద్దేశపూర్వకంగా మరచిపోతుంటారు. ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పర్యటనలో జగన్.. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అంటూ.. జనసేన పార్టీ అంటే రౌడీల పార్టీ అంటూ కొత్త భాష్యం చెప్పారు. దీంతో జగన్ భాష్యం సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. అంతేకాదు వైసీపీ అధినేత వైఖరి గురివింది సామెతను గుర్తుకు తెస్తోందంటూ.. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన తొలి కేబినెట్‌లో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు.. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లపై మీడియా సమావేశాలు పెట్టి మరీ బూతుల వర్షం కురిపించే వారన్న సంగతి జగన్ కన్వీనియెంట్ గా మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు.

పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నాని పేరు అయితే.. బూతు సరఫరాల శాఖ మంత్రిగా అప్పట్లో ముద్ర పడిపోయింన సంగతి తెలిసిందే. అలాగే నాటి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నోరు విప్పితే బూతుల వరద కాదుకాదు బురద పారుతుందని గుర్తు చేస్తున్నారు. పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసు, కురసాల కన్నబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి అభ్యంతరకర భాషలోనే విమర్శలు గుప్పించిన విషయమూ తెలిసిందే కదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

అంతదాక ఎందుకు ప్రస్తుత మంత్రులు అంబటి రాంబాబు, రోజా, జోగి రమేశ్‌ తదితరులకు జగన్ మలి కేబినెట్‌లోని చోటు దక్కిందంటే.. అదంతా.. బూతుల మహిమే కదా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ తొలి కెబినెట్‌లో అయినా.. మలి కేబినెట్‌లో అయినా.. మంత్రిగిరి దక్కిందంటే.. అదంతా.. బూతులతో వారు చేసిన విమర్శల మహిమేనన్న అభిప్రాయం వ్యక్తం వ్యక్తమౌతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన… ఈ మూడున్నరేళ్ల కాలంలో.. ఆయన కేబినెట్‌లోని మంత్రులు చేసిన బూతు పద ప్రయోగాలు.. ముఖ్యమంత్రి గారికి కడు కమనీయంగా.. రమణీయంగా.. వినసొంపుగా ఉన్నాయని.. నెటిజన్లు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు.

అదీకాక అధికార ఫ్యాన్ పార్టీలోని నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతి, దాడులు, ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలు పడుతోన్న ఇబ్బందులును ఏ మాత్రం ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని.. వాటిని ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు.. ఎప్పటి కప్పుడు ఎత్తి చూపడంతో.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తట్టుకోలేక ఓ విధమైన ఆందోళనకు గురవుతున్నారని.. ఆ ఆందోళనే నరసాపురం వేదికగా.. ముఖ్యమంత్రి మాటల్లో ప్రతిఫలించిందనీ అంటున్నారు. ఏదీ ఏమైనా ముఖ్యమంత్రి జగన్‌ తీరు గురివింద సామెతను గుర్తుతెస్తోందనీ, అని.. ఆయన నైజం పరనింద అని తేటతెల్లమైందని నెటిజన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News