Tuesday, October 8, 2024
HomeతెలంగాణCabinet subcommittee on SC classification: ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏక వ్యక్తి న్యాయ కమిషన్...

Cabinet subcommittee on SC classification: ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏక వ్యక్తి న్యాయ కమిషన్ మంత్రివర్గ ఉపసంఘం

2011 సెన్సెస్ ప్రకారం..

ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకవ్యక్తి కమిషన్ ఏర్పాటు చెయ్యాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ నియామకంలో అడ్వకేట్ జెనరల్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఉపసంఘము తీర్మానించింది. అంతేగాకుండా ఏకవ్యక్తి కమిషన్ చట్టపరంగా పటిష్టంగా ఉండడంతో పాటు కమిషన్ సిఫారసులను అమలులోకి తీసుకొస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియామకం జరిగేలా చూడాలని ఉపసంఘము ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.

- Advertisement -

సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, లోకసభ సభ్యులు మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయం విదితమే.

ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నాలుగోసారి మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయ్యింది. మంత్రులు దామోదర్ రాజనరసింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి, అడ్వకేట్ జెనరల్ సుదర్శన్ రెడ్డి, బి.సి కమిషన్ చైర్మన్ నిరంజన్,లా సెక్రటరీ తిరుపతి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వ యస్.సి అభివృద్ధి శాఖా ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, ఐ.ఏ.యస్ అధికారులు బుర్రా వెంకటేశం, లోకేష్ కుమార్, దానకిశోర్, టి.కే.శ్రీదేవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
ఎస్సి వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు,పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించి అధ్యయనం చేసిందన్నారు.

2011 సెన్సెస్ ప్రకారం..

2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉపకులాల వర్గీకరణ ఉంటుందని అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉద్యగ నియామకలతో సహా నివేదికను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు గాను మంత్రివర్గ ఉప సంఘం జిల్లాల వారీగా పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అధ్యయనాన్ని టైంబౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చెయ్యాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన బిసిల సాంఘిక ఆర్డిక గణన చేపట్టాలని సూచించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News