Friday, October 25, 2024
Homeఇంటర్నేషనల్Prapancha Telugu Samakhya Mahasabhalu: హైదరాబాదులో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు

Prapancha Telugu Samakhya Mahasabhalu: హైదరాబాదులో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు

12వ ద్వైవార్షిక..

హైదరాబాదులో 2025 జనవరి 3, 4, 5 తేదీలలో ఘనంగా ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలు

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటిత పరచి, వారిలో సోదరభావం, పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందిస్తూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ – విలువలను, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపోషిస్తూ నేటితరం మరియు భావితరాలకు అందించడానికి తగిన సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నది ప్రపంచ తెలుగు సమాఖ్య. తెలుగువారిలో సృజనాత్మకత, పరస్పర సహకారభావం పెంపొందేలా ఒక విశ్వవేదికను కల్పిస్తూ విశ్వవ్యాప్తంగా తెలుగుజాతి వ్యాపారాభివృద్ధికి తద్వారా సామాజిక, ఆర్థికాభివృద్ధికి తనవంతు కృషి చేస్తూ, ‘సంఘీభావమే బలం’ అన్న నినాదంతో నిరంతరం తెలుగుజాతి పురోగతికి పాటుపడుతున్న విశ్వవ్యాప్త తెలుగుజాతి సమైక్య వేదిక ‘ప్రపంచ తెలుగు సమాఖ్య’.

తెలుగుజాతికి ప్రాచీనమైన, విశిష్టమైన చరిత్ర ఉంది. ప్రశస్తమైన, విలక్షణమైన భాషా, సాహిత్య, సంస్కృతులు ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవడంతో పాటు పరివ్యాప్తం చేయవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఈ తరానికి వాటి ఔన్నత్యాన్ని చాటి చెప్పవలసి ఉంది. వారిలో వాటి పట్ల ఆదరాభిమానాలు, గౌరవమర్యాదలు ఇనుమడింపజేయవలసి ఉంది. ఈనాటి ఆధునిక, సాంకేతిక యుగానికి తగినట్టుగా వాటిని మలచుకొని, యువతరం విద్య, వ్యాపార, వాణిజ్య, ఆర్థిక, సామాజిక, శాస్త్ర సాంకేతిక, కళారంగాలలో రాణిస్తూ, తెలుగుజాతి ఉనికిని కాపాడుకోవాలి. అందుకు స్ఫూర్తిని అందించడానికి 1993లో స్థాపించబడిన ‘ప్రపంచ తెలుగు సమాఖ్య’ దాదాపు ముప్పయి (30) సంవత్సరాలుగా కృషి చేస్తోంది. అందులో భాగంగా తెలుగునాట అనేక కార్యక్రమాలతో పాటు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ‘అంతర్జాతీయ తెలుగు మహాసభలు’ నిర్వహిస్తూ వస్తోంది. ఇంతవరకు వివిధ రాష్ట్రాలలో, విదేశాలలో పదకొండు ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలు చెన్నై, హైదరాబాదు, ఢిల్లీ, విశాఖపట్నం, సింగపూరు, బెంగళూరు, దుబాయ్, విజయవాడ, మలేసియాలలో, మరల 2018లో చెన్నైలో జరిగాయి.

ప్రస్తుతం ప్రపంచ తెలుగు సమాఖ్య ‘పన్నెండవ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలను ‘2025 జనవరి 3, 4, 5 తేదీలలో హైదరాబాదులో హైటెక్ సిటీలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ & హెచ్ఐసిసి కాంప్లెక్స్లో నిర్వహించడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుపుతోంది. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ వి.ఎల్.ఇందిరాదత్ గారి అధ్యక్షతన ఘనంగా జరిగే ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గౌరవ అతిథులుగా ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర మరియు కేంద్రమంత్రులు మరికొందరు వివిధ రంగాల తెలుగు ప్రముఖులు హాజరు అయ్యే అవకాశం ఉంది.

ఈ మహాసభల్లో ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను సత్కరించడం జరుగుతుంది. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం మరియు వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు జరుగుతాయి. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకములు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీకళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటాయి.

ఈ మూడు రోజుల అంతర్జాతీయ మహాసభలకు హాజరు కావాలనుకునే తెలుగు భాషాభిమానులు, కళాభిమానులు ముందుగా తమ తమ పేర్లను ప్రతినిధులుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ తెలుగు సమాఖ్య ‘వెబ్సైట్’లో ఉంచబడిన ప్రతినిధుల నమోదీకరణ పత్రం (డెలిగేట్ రిజిస్ట్రేషన్ ఫారం) ద్వారా కూడా ‘ఆన్లైన్లో’ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ వి.ఎల్.ఇందిరాదత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటిత పరచి, వారిలో సోదరభావం, పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందిస్తూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపోషిస్తూ నేటితరం, భావితరాలకు అందించడానికి తగిన సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నది ప్రపంచ తెలుగు సమాఖ్య. ప్రస్తుతం ప్రపంచ తెలుగు సమాఖ్య ‘పన్నెండవ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలను ‘2025 జనవరి 3, 4, 5 తేదీలలో హైదరాబాదులో హైటెక్ సిటీలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ & హెచ్ఐసిసి కాంప్లెక్స్లో నిర్వహించడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుపుతున్నాం. ఈ మహాసభల్లో ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను సత్కరించడం జరుగుతుంది. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం మరియు వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు జరుగుతాయి. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకములు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీకళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మరియు దేశవిదేశాల నుండి సుమారు రెండువేలమంది ప్రతినిధులు ఈ 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలకు హాజరు కాగలరని ఆశిస్తున్నాము’ అన్నారు

సాంస్కృతిక కమిటీ సభ్యుడు సాయి మాట్లాడుతూ.. 2025 జనవరి 3, 4, 5 తేదీలలో హైదరాబాదులో హైటెక్ సిటీలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ & హెచ్ఐసిసి కాంప్లెక్స్లో మహాసభలు జరుగుతాయి. 3న జరిగే ఇనాగరల్ కి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించాం. అలాగే 5న జరిగే కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించాం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా విచ్చేసే అవకాశం వుంది. దేశ విదేశాల నుంచి దాదాపు 150 తెలుగు అసోషియేషన్స్ ఈ మహాసభల్లో పాల్గొననున్నారని భావిస్తున్నాం. తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ మహా సభలు ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారి ఆశయాలు వారధిగా వుంటాయని భావిస్తున్నాం’ అన్నారు

ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు శ్రీ హరీష్ చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. 2025 జనవరి 3, 4, 5 తేదీలలో హైదరాబాదులో ఘనంగా ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. ఈ మహా సభలకు అందరూ ప్రతినిధులుగా హాజరు కావాలని కోరుతున్నాం. తెలుగు సంస్కృతి ప్రతిభింబించేలా ఈ మహా సభలు జరగబోతున్నాయి. నవతరానికి కూడా ఆకర్షించేలా కార్యక్రమాలు జరగబోతున్నాయి. తెలుగు వాడిననే గర్వించే సంతృప్తి ఈ సభలు కలిగిస్తాయని విశ్వసిస్తున్నాం’ అన్నారు.

వైస్ ప్రెసిడెంట్ కవిత దత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు తియ్యటి భాష. అలాంటి తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లో మనఇళ్ళలో మరుగున పడుతోంది. పిల్లలు తెలుగు ఎందుకు చదువుకోవాలనే ఉద్దేశంలోకి వచ్చారు. సిలబస్ కూడా అలానే వుంది. కాబట్టి తెలుగు మీద వాళ్ళకి ఆసక్తి లేకుండా పోతోంది. సిలబస్ మారిస్తే తెలుగు పై ఆసక్తి కలుగుతుంది. చిన్నతనం నుంచే పిల్లల తెలుగుని పైకి తీసుకుపోవాలి. ఈ విషయంలో సామాఖ్య ఎంతో కృషి చేస్తోంది. ఉచిత పాఠాలు చెబుతున్నాం. అన్ లైన్ లో పద్యాలు, కథలు చెప్పే ఏర్పాటు జరిగింది. పెద్ద వాళ్ళలో కూడా పిల్లలకి తెలుగు నేర్పించాలనే ఉత్సుకత రావాలనేది మా ఆశయం. ఈ మహాసభలు అలాంటి గొప్ప ఉత్తేజం ఇస్తాయని’ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News