Saturday, October 26, 2024
Homeటెక్ ప్లస్MEIL donates 200 crs to Skill University: స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్లిచ్చిన...

MEIL donates 200 crs to Skill University: స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్లిచ్చిన మెగా ఇంజినీరింగ్ సంస్థ

మెగా వితరణ..

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ముందుకొచ్చింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో యూనివర్సిటీ క్యాంపస్ లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది.

- Advertisement -

ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. శనివారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వం తలపెట్టిన స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునేందుకు మెఘా కంపెనీ చర్చలు జరిపింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణం చేపడుతామని ప్రకటించింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.

హైదరాబాద్ శివార్లలో కందుకూరు మండలంలో మీర్ ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగస్ట్ లోనే యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులుండేలా క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్ నిర్మిస్తామని మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు.

ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News