తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా కేసులు, అరెస్టులు, ఆస్తుల గొడవలు, కోర్టు వివాదాలే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది మంత్రులు అరెస్టు అవుతారని ప్రస్తుత తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాంబులా పేలాయి. దానిమీద కేటీఆర్ కూడా స్పందించడం విశేషం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల కోసం న్యాయవివాదం మొదలైంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంపకాల గొడవలు ముదురుపాకాన పడ్డాయి. ఇక ఆంధ్రప్రదేశ్కు మోదీ ప్రభుత్వం ఘనంగా ఇస్తున్నట్లు ప్రకటించిన అమరావతి రైల్వేలైన్ కాస్తా సింగిల్ లైనేనని తేలిపోవడంతో రాష్ట్ర ప్రజలు ఉసూరుమంటున్నారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటూ అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసి దాదాపు 50 రోజులకు పైగా జైల్లో పెట్టింది. తాజాగా తెలంగాణలోనూ ఈ తరహా వ్యవహారాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. గత సర్కారులో కీలక నేతలు నంబరు 1 నుంచి 8 వరకు అందరినీ అరెస్టు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం రేపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కొందరు నేతల విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన పొంగులేటి.. ఏకంగా సియోల్ పర్యటనలో సైతం దాని గురించి మాట్లాడారు. అక్రమాలకు పాల్పడిన వారందరి గురించి ఫైళ్లు రెడీ అయ్యాయని, దీపావళి టపాసులా ఏదో ఒక కుంభకోణం పేలుతుందనీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల లోతు చూస్తే ఆయనేదో ఆషామాషీగా అన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే.. అన్నింటికీ తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని కచ్చితంగా చెబుతున్నారు.
కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం (మొదట్లో టీఆర్ఎస్) పదేళ్ల పాటు చాలా బలంగానే కనిపించింది. తర్వాత కూడా అధికారంలోకి రావడం ఖాయమన్నట్లుగానే గులాబి నేతలు గట్టిగా భావించారు. బహుశా అందుకేనేమో.. ఫోన్ ట్యాపింగ్, ధరణి, భూములకు సంబంధించిన పలు వ్యవహారాల్లో ఆ పార్టీ నేతలు ఒక రకంగా చెప్పాలంటే రెడ్ హ్యాండెడ్గానే దొరికిపోయారు. పైకి అధికారులే ప్రస్తుతానికి కనిపిస్తున్నా, వాటి వెనక నేతల హస్తం ఉందన్నది బహిరంగ రహస్యం. ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు రాకుండానే పోలీసు అధికారులు తమంతట తాముగా ప్రతిపక్ష నాయకులు, సినిమా నటీనటులు, వ్యాపారులు.. ఇలా పలు వర్గాలకు చెందినవారి ఫోన్లు ట్యాపింగ్ చేయడం, అందుకోసం అత్యాధునిక పరికరాలను విదేశాల నుంచీ తెప్పించడం ఎంతవరకు సాధ్యమన్నది అందరికీ తెలుసు. అయితే అనుకోని పరిస్థితుల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో మట్టికరిచింది. స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
సాధారణంగా ప్రాంతీయ పార్టీల నేతలు, అందులోనూ ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి, ఆ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దానికి అధినేతలుగా అయినవారు కొంతమందిని చూస్తుంటే.. ఇలా వాళ్ల మీద ఏదో ఒక తరహా కేసులు రాక మానడం లేదు. ఈ అన్ని సందర్భాల్లోనూ చూసుకుంటే నిజంగానే వాళ్లు ఏవైనా అక్రమాలకు పాల్పడ్డారా.. లేదా కావాలనే అధికారంలోకి వచ్చిన జాతీయ పార్టీలు వాళ్ల మీద కక్ష సాధించడానికి ఇలా చేస్తున్నాయా అన్న అనుమానం రాక మానదు. ప్రాంతీయ పార్టీలకు గట్టి అభిమానులు ఉంటారు. ఒక వర్గంలో ఆయా పార్టీలకు అపారమైన బలం ఉంటుంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు కొత్త రాష్ట్రం తీసుకొచ్చినప్పుడు వాళ్ల మీద అంచనాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి తీర్చలేకపోయినా.. ముందు ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా ఫలితాలు దారుణంగా ఉంటాయి. అప్పటివరకు పల్లకీలో మోసినవాళ్లే ఒక్కసారిగా పల్లకీని తిరగేసే ప్రమాదం లేకపోలేదు.
ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పరిస్థితి కూడా దాదాపు అలాగే తయారైంది. వాళ్ల మీద వస్తున్న ఆరోపణల్లో ప్రధానమైనది భూ ఆక్రమణలు, అక్రమ కొనుగోళ్లు. అధికారంలో ఉండగా దాదాపు ప్రతిచోటా కొత్తగా ఏదో ఒక అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ నేతలు కారుచౌకగా ముందే కొనేసి పెట్టుకున్నారని, ఆ తర్వాతే అక్కడ ప్రాజెక్టులు ప్రకటించి వాటి రేట్లు పెంచుకున్నారన్న ఆరోపణలు గుప్పుమనేవి. అప్పటి మంత్రులు, వాళ్ల అనుచరులు కూడా పలు ప్రాంతాల్లో భూములు ఆక్రమించుకున్నారని చెబుతుంటారు. కుంభకోణాలు, అవినీతితో సంపాదించిన ఆస్తులను రికవరీ చేసేందుకు కూడా వెనకాడబోమని, ఆ విషయాన్ని చట్టమే చూసుకుంటుందని పొంగులేటి వ్యాఖ్యానిస్తున్నారంటే.. కేవలం అరెస్టులతోనే ఆగకపోవచ్చన్న సిగ్నల్ కనిపిస్తోంది.
పాత్రికేయుల్లో కూడా చాలామంది బీఆర్ఎస్ నేతల తీరు విషయంలో గుర్రుగానే ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిజాంపేట, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో కలిపి 70 ఎకరాలు ఇచ్చారు. వాటిని ఆ సొసైటీ అప్పటి మార్కెట్ రేటు చెల్లించి మరీ కొనుగోలు చేసింది. అయితే, సంబంధిత జీఓ విడుదల చేయడంలో అందరికీ కలిపి ఒకే జీఓ ఇవ్వడంతో దానిపై న్యాయవివాదం మొదలైంది. ఎప్పుడో 2008లో ఒక్కొక్కరు అప్పులు చేసి మరీ రూ. 2 లక్షల చొప్పున కట్టినా, ఇప్పటికీ ఆ భూమి వారి చేతికి రాలేదు. సుప్రీంకోర్టు తీర్పు వస్తే వెంటనే ఇచ్చేస్తామని కేసీఆర్ ఒక సమయంలో ప్రకటించినా.. తర్వాత తీర్పు వచ్చినా ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పట్లో… నిజాంపేట స్థలంలో టవర్లు కట్టించి సొసైటీ సభ్యులందరికీ ఉచితంగా ఫ్లాట్లు ఇప్పిస్తామని, పేట్ బషీరాబాద్ సైట్ (38 ఎకరాలు) తమకు వదిలేయాలని బీఆర్ఎస్ వర్గాల నుంచి సొసైటీ నేతలకు ఫీలర్లు కూడా వదిలినట్లు అనధికారిక సమాచారం. అయితే, సభ్యులందరికీ సొంత ఇళ్ల కోసమే స్థలాలు రావాలన్న ఉద్దేశంతో సొసైటీ ఏర్పడినందున.. నాయకులు ఆ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొంత వరకు మార్గం సుగమమైంది.
ఇలా భూముల విషయంలో బీఆర్ఎస్ నాయకుల మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అందుకే రెవెన్యూ మంత్రి కూడా అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాస్త గట్టిగానే స్పందించారు. ధరణి–భూముల అక్రమాలకు సంబంధించిన అంశాలనే వెలుగులోకి తెచ్చి కేసులు పెడతారని సమాచారం. ధరణి చట్టం వచ్చాక అనేక భూ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంలో సీసీఎల్ఏ స్థాయిలో క్లియర్ చేయాల్సిన కొన్ని భూముల అంశాలను.. కలెక్టర్ల స్థాయిలోనే చేసేశారనే ఆరోపణలు ఉన్నాయి. ధరణి వ్యవహారాలను ఒక ప్రైవేటు సంస్థ టెరాసిస్కు ఇచ్చి, దాన్ని అడ్డుపెట్టుకుని కూడా కొన్ని లావాదేవీలు అక్రమంగా చేశారన్న సమాచారం ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటి దృష్ట్యా తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
అయితే.. పొంగులేటి వ్యాఖ్యల మీద కేటీఆర్ కూడా కాస్త గట్టిగానే స్పందించారు. నిజమైన బాంబులకే తాము భయపడలేదని.. ఏం చేస్తారో చేసుకోమని సవాల్ విసిరారు. చంద్రబాబు, వైఎస్ఆర్ వంటి వారితోనే పోరాటం చేశామని.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ వ్యాఖ్యానించారు. తాము ఒరిజనల్ బాంబులకే భయపడలేదన్నారు. అంతే కాదు.. పోలీసులను కూడా ఒక రకంగా కేటీఆర్ హెచ్చరించారు. అధికారులు జాగ్రత్తగా చూసుకుని పోవాలని, తేడా వస్తే మిత్తితో సహా అన్నీ తేలుస్తామని.. ఇప్పుడు అతిగా ప్రవర్తించే అధికారుల పేర్లన్నీ రాసి పెట్టుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలే గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో లోకేశ్ ఒక ఎర్రటి అట్ట ఉన్న పుస్తకం చేతిలో పట్టుకుని.. రెడ్బుక్లో అందరి పేర్లూ రాస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఏం చేయాలో తమకు బాగా తెలుసని, రెడ్ బుక్ ఆధారంగానే చర్యలు ఉంటాయని హెచ్చరించేవారు. అందుకు తగినట్లుగా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శిస్తున్నారు. కేటీఆర్ సైతం దాదాపు అదే గొంతు వినిపించడం విశేషం.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య కంటే, ప్రతిపక్షంలో ఒకే కుటుంబానికి చెందిన రెండు పార్టీల నేతల మధ్య యుద్ధం నడుస్తోంది. అది కూడా సొంత అన్నాచెల్లెళ్ల మధ్యే కావడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గతంలో తాను ప్రేమాభిమానాలతో తన చెల్లెలు షర్మిలకు కొన్ని ఆస్తులు గిఫ్ట్ డీడ్ చేశానని, ఆ డీడ్ రద్దు చేసుకుంటానని కోర్టును ఆశ్రయించడం జాతీయ స్థాయిలో సంచలనాత్మకంగా మారింది.
ఒక కంపెనీలోని వాటాల గురించి వైఎస్ జగన్, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో వైఎస్ జగన్.. తనకు, తన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య ఉన్న విభేదాల గురించి కూడా ప్రస్తావించారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో వాటాల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతి పిటిషన్ వేశారు. ఈ సంస్థలో తమ వాటాలను ‘‘అక్రమంగా’’ తన తల్లి వైఎస్ విజయమ్మ పేరు మీదకు బదిలీ చేశారని, ఆ షేర్ల బదిలీని రద్దు చేయాలని ఆ పిటిషన్లో కోరారు.
సరస్వతి షేర్ల బదిలీకి సంబంధించి 2019 ఆగస్టు 31న ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం విజయమ్మను ట్రస్టీగా ఉంచి ఆ ట్రస్ట్ ద్వారా షర్మిలకు కంపెనీ షేర్లు భవిష్యత్తులో బదిలీ చేస్తారు. అది కూడా వైఎస్ జగన్, ఆయన భార్య భారతి సమ్మతి మేరకు నిర్ణయం తీసుకుంటారు. అందులో భాగంగా వైఎస్ జగన్, ఆయన భార్య భారతి కొన్ని ఈక్విటీ షేర్లను వైఎస్ విజయమ్మకు బహుమతిగా ఇచ్చారు. భవిష్యత్తులో కోర్టు అనుమతులు లభించాక జగన్, ఆయన భార్య అంగీకారం మేరకు షేర్లను బదిలీ చేయాలనే ఉద్దేశంతో ఆ షేర్లను బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంటే ఆ గిఫ్ట్ డీడ్ను జగన్, భారతిల అనుమతి లేకుండా ఎగ్జిక్యూట్ చేయడానికి వీల్లేదు. కానీ, తమ అనుమతి లేకుండానే ఆ గిఫ్ట్ డీడ్ను ఎగ్జిక్యూట్ చేశారని పిటిషన్లో జగన్, ఆయన భార్య పేర్కొన్నారు. షర్మిల ప్రోద్బలంతోనే విజయమ్మ షేర్లు తన పేరుమీదకు బదిలీ చేయించుకున్నారని, షర్మిల ముందస్తు ఆలోచనతోనే ఉద్దేశపూర్వకంగానే అలా వ్యవహరించారని జగన్ దంపతులు భావించారు. షర్మిల అనుబంధం మరిచిపోయి వ్యక్తిగత దూషణలకు కూడా దిగారని, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ వాటాలను తిరిగి తీసుకోవాలని భావిస్తున్నామని జగన్ తన పిటిషన్లో తెలిపారు.
ఈ వ్యవహారం అంతా చూస్తే.. నిజానికి గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ అనేది ఆస్తుల బదిలీలో ఒక పద్ధతి. సాధారణ వ్యక్తులైతే వీలునామా రాస్తారు. తండ్రి నుంచి పిల్లలకు దక్కాల్సిన ఆస్తిపాస్తుల వివరాలను ఎవరెవరికి ఎంతెంత వాటా ఇవ్వాలో ప్రస్తావిస్తూ వీలునామా సిద్ధం చేస్తారు. అయితే, ఈ వీలునామాను రాసినవాళ్లు తమ జీవితకాలంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. అదే గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ రాస్తే మాత్రం.. దాన్ని మార్చాలంటే తప్పనిసరిగా కోర్టుకు వెళ్లాలి. ఆ కోర్టు ఎవరి పేరుమీద అయితే గిఫ్ట్ డీడ్ ఉందో, వాళ్లను కూడా పిలిపిస్తుంది. ఎందుకు మార్చాలనుకుంటున్నారన్న విషయాన్ని ఆస్తి అసలు యజమాని (తండ్రి లేదా వేరే ఎవరైనా) కోర్టుకు సమర్థంగా వివరించగలిగితే, కోర్టు ఆ వాదనతో సంతృప్తి చెందితే అప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ను రద్దుచేస్తుంది.
తన పిటిషన్లో ‘‘జగన్కు, షర్మిలకు మధ్య అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ బంధం లేదు’’ అని పేర్కొనడం చర్చనీయాంశమైంది. ‘‘జగన్ పట్ల కృతజ్ఞత లేకపోవడమే కాదు, ఆయన మంచిని పట్టించుకోకుండా షర్మిల వ్యవహరిస్తున్నారు. బహిరంగంగా జగన్ మీద అనేక తప్పుడు ఆరోపణలు చేశారు. షర్మిల తీరు రాజకీయంగా జగన్ను వ్యతిరేకించడమే కాకుండా ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఉంది. అందువల్ల అన్నాచెల్లెళ్ల మధ్య ఉండాల్సిన ప్రేమ, అభిమానం కరిగిపోయాయి’’ అని నేరుగా పిటిషన్లోనే రాశారు. దాంతోపాటు తామిద్దరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి, వాటిని సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకోవాలని కోరడం సరికొత్త విషయం. దాన్ని కోర్టు కూడా పరిగణనలోకి తీసుకుంది.
షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు జగన్ దాని గురించి ఏమీ స్పందించలేదు. ఆ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి తన అన్న జగన్ మీద నేరుగా విమర్శలు చేయడం ప్రారంభించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ప్రస్తావిస్తూ, ఆయన కుమార్తె సునీతను వెంట పెట్టుకుని వివేకా హత్యకు జగనే కారకుడంటూ ఘాటు విమర్శలకు దిగారు. జగన్ను, అప్పటి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఒక ప్రధానాస్త్రంగా వివేకా హత్య కేసును వాడుకున్నారు. అప్పట్లో టీడీపీ వర్గాలు కూడా సునీతకు గట్టిగానే మద్దతిచ్చినట్లు కనిపించాయి. అయితే, ఎన్నికలు అయిన మరుక్షణం నుంచి వివేకా హత్యకేసు దర్యాప్తు వ్యవహారం ఒక్కసారిగా మటుమాయం అయి పోయింది. దాని గురించి సునీత పట్టుబట్టడం లేదు, షర్మిల ఏమీ అనట్లేదు, చంద్రబాబు ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు.
గత సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటమికి ఉన్న ప్రధాన కారణాల్లో షర్మిల విమర్శలు, తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయన్నది జగన్ నిశ్చితాభిప్రాయం. షర్మిలతో విభేదాలు ఇకపైనా కొనసాగుతాయనే బలమైన సంకేతం ఇవ్వడానికే జగన్ ఈ పిటిషన్ వేశారని స్పష్టంగా తెలుస్తోంది. భారతి సిమెంట్స్, సాక్షిలో కూడా మనవడు, మనవరాళ్లకు (మొత్తం నలుగురు) సమాన వాటాలు రావాలని షర్మిల అంటున్నారు. అంటే కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఆస్తులే కాకుండా.. ఆయన బతికున్న సమయంలో జగన్ ప్రారంభించిన వ్యాపారాల్లోనూ తమకు వాటాలు ఉంటాయన్నది షర్మిల వాదనలా కనిపిస్తోంది. చట్టప్రకారం ఈ వాదనలు ఎంతవరకు నిలుస్తాయన్నది, ఎవరిది పైచేయి అవుతుందన్నది కోర్టులు తేలుస్తాయి. కానీ, ఈలోపు అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న గొడవలు తారస్థాయికి చేరిపోవడం శోచనీయం. తన వ్యక్తిత్వాన్ని హననం చేయడం వల్లే ఇప్పుడు ఈ వివాదాన్ని జగన్ మొదలుపెట్టారన్నది స్పష్టంగా తెలుస్తోంది. పోతే పోయిందని వదిలేయకుండా.. షర్మిల కూడా దీనిమీద గట్టి పట్టుదలతోనే వ్యవహరిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే.. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం చాలా ఇచ్చేస్తున్నట్లు ప్రతిసారీ ప్రకటిస్తూనే… చివరకు మొండిచేయి చూపిస్తోందన్నట్లు కనిపిస్తోంది. అమరావతి రైల్వేలైన్ మంజూరు చేస్తున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘనంగా ప్రకటించారు. అది చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల నుంచి రాష్ట్ర ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ఎంతగానో ఉబ్బిపోయారు. ఇంకేముంది, అమరావతికి రైలు కనెక్టివిటీ కూడా వచ్చేసినట్లేనని సంబరపడ్డారు. కానీ, గతంలో పవన్ కల్యాణ్ విమర్శించినట్లుగా ఈసారి కూడా ఇచ్చింది పాచిలడ్డూల్లాగే ఉన్నాయి. ఎందుకంటే, ఒకవైపు దేశవ్యాప్తంగా ఉన్న రెండు లైన్లంటినీ నాలుగు లైన్లకు విస్తరించాలని రైల్వేశాఖ భావిస్తుంటే.. ఇప్పుడు కొత్తగా వేయబోయే అమరావతి లైను మాత్రం సింగిల్ లైనుగానే ఉండబోతోంది. ఇంతకుముందు గుడివాడభీమవరంనరసాపురం లాంటివి సింగిల్ లైన్లుగా ఉండేవి. ఆ మార్గాల్లో ప్రయాణించేవారు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడకు ఉండే రైళ్లే పరిమితంగా ఉంటాయి, అవీ ఏ సమయంలో రెండు రైళ్లు ఒకేసారి వెళ్లాలన్నా, క్రాసింగ్ పేరు చెప్పి రెండోదాన్ని గంటల తరబడి ఆపేస్తారు. ఒకవైపు హైస్పీడ్ రైల్ కారిడార్లు వేయాలని తలపెడుతూ.. మరోవైపు ఇప్పుడు కూడా సింగిల్ లైన్ కేటాయించడం వెనక పరమార్థం ఏంటో కేంద్ర ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. పైపెచ్చు, ఇది ఇప్పుడంటే చెబుతున్నారు గానీ, ఎప్పటికి పూర్తవుతుందన్నది అగమ్యగోచరమే. ఎందుకంటే.. ఎప్పుడో 1998లో నాటి రైల్వేమంత్రి మమతా బెనర్జీ శంకుస్థాపన చేసిన కోటిపల్లి నరసాపురం లైనుకు ఇప్పటివరకు మోక్షం లేదు. కనీసం సర్వే కూడా పూర్తి కాలేదు. ఇలాగే కొవ్వూరుభద్రాచలం లాంటి చాలా లైన్లు ఏమాత్రం కదలిక లేకుండా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. వీటి కంటే అమరావతి లైను కొంత వేగంగా వెళ్లే అవకాశం ఉన్నా.. నాలుగేళ్లలో మాత్రం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దాదాపు రూ.2,250 కోట్లు వెచ్చిస్తామని చెబుతున్నా, ఇది సింగిల్ లైన్ కావడం వల్ల కేంద్రం చెబుతున్నట్లు ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య అనుసంధానికి ఇది ఏమాత్రం పనికిరాదు. ఎన్డీయే 1 ప్రభుత్వంలోనే దీనికి ఆమోదం తెలిపినా, ఇప్పుడు ప్రకటన వరకు వచ్చారు. అమరావతి లాంటి గ్రీన్ఫీల్డ్ రాజధానికి కనీసం డబుల్ లైన్ ఉంటేనే ఉపయోగం. మిగిలిన చోట్ల మూడు, నాలుగు లైన్లు ఉన్నప్పుడు.. అందులోనూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ లైన్ కావాలని అడిగినా కూడా సింగిల్ లైన్ మాత్రమే ఇచ్చి, అదేదో చాలా గొప్ప పని అన్నట్లు కేంద్రం ప్రకటించుకోవడం.. దానికి రాష్ట్రంలోని పాలకపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ భజన చేయడం సామాన్యుడికి ఏమాత్రం నచ్చట్లేదు. ప్రస్తుతానికి అందరి మధ్య సంబంధాలు బాగున్నాయి కాబట్టి సరే. రేపు ఏమాత్రం తేడా వచ్చినా.. పవన్ కళ్యాణ్ లాంటి ఆవేశపరులైన నాయకులు దీన్ని కూడా మళ్లీ పాచిపోయిన లడ్డూలతోనే పోల్చడం ఖాయం.
- –7674869432