Thursday, September 19, 2024
Homeనేషనల్BRS: మహిళా రిజర్వేషన్ కోసం కవిత నిరాహార దీక్ష

BRS: మహిళా రిజర్వేషన్ కోసం కవిత నిరాహార దీక్ష

మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంటులో ఆమోదించగలిగిన బీజేపీ ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు కవిత ప్రకటించారు. 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ పై బిజెపి చేర్చిందని, ఆ హామీని ఇప్పటికైనా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం మూడు పార్లమెంటు సమావేశాలు మాత్రమే ఉన్నాయని, మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాల్సిందేనంటూ ఆమె పట్టుబడుతున్నారు.
తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తి పెంపొందించాలి అన్న లక్ష్యంతో పని చేసి, నేడు దేశవ్యాప్తంగా కూడా అదే పని చేయాలన్న ఉద్దేశంతో భారత్ జాగృతిగా రూపాంతరం చెందిందని గుర్తుచేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జంతర్మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేయాలనే నిర్ణయించినట్టు తెలిపారు. పోలీసుల అనుమతి ప్రకారం మార్చి 10 న ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు పెద్ద ఎత్తున మహిళలతో కలిసి జంతర్ మంతర్ లో దీక్ష చేస్తామని తెలిపారు.
మార్చి 8 న హోళీ పండుగ ఉన్నందును మార్చి 10 న ఢిల్లీలో దీక్ష చేస్తున్నామని, మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్ల క్రితం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన దేశాలు 2026 నాటికి లింగ సమానత్వ లక్ష్యాలను చేరుకుంటాయని తెలిపారు. కానీ రిజర్వేషన్ కల్పించని భారత్ వంటి దేశాలు ఆ లక్ష్యాన్ని చేసుకోవాలంటే 2063 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పారు. ఇందులో రాజకీయమేమీ లేదని, సగం జనాభాను ఇంట్లో కూర్చోబెట్టి దేశాన్ని సూపర్ పవర్, విశ్వగురువుగా చేయలేరని విమర్శించారు.

- Advertisement -

ప్రస్తుతం 21 రాష్ట్రాలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాయన్న ఎమ్మెల్సీ ‌కవిత, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఇప్పటికీ 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు గాను పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించడంతో పాటు, మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రత్యామ్నాయాలు కూడా సూచించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. పార్లమెంట్ ఎంపీల సంఖ్యను 33 శాతం పెంచి మహిళలకు కేటాయించాలని గతంలో సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. 1952 లో మొదటి లోక్ సభలో 24 మహిళా ఎంపీలు ఉండగా, ప్రస్తుతం 78 మహిళా ఎంపీలు ఉన్నారన్న ఎమ్మెల్సీ కవిత, 75 ఏండ్ల స్వాతంత్ర భారతంలో మహిళల ప్రాతినిధ్యం అనుకున్నంతగా లేదన్నారు. 10 న జంతర్ మంతర్ లో నిర్వహించే ధర్నాకు అన్ని రాష్ట్రాల నుండి వివిధ మహిళా సంఘాల నేతలు, రాజకీయ నేతలు పాల్గొననున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News