ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అందరికీ ఇళ్లు(House For All) పథకం నిబంధనలపై తాజాగా జీవో జారీ అయింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది. అలాగే ఏజెన్సీ ద్వారా ఇళ్లు నిర్మించనుంది. ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులుగా నిర్ణయించింది. ఆధార్, రేషన్ కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుంది. రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది.
- Advertisement -
మార్గదర్శకాలు ఇవే..
- పట్టణాల్లో ప్రభుత్వ స్ధలం ఉన్న చోట ఇంటి మహిళ పేరుతో 2 సెంట్ల చొప్పున కేటాయిస్తారు.
- పట్టణాల్లో ప్రభుత్వ భూములు లేని చోట ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇస్తారు.
- ఇంటి స్ధలం లేదా ఇల్లు పొందిన వారికి దానిపై పూర్తి హక్కులు పదేళ్ల తర్వాతే లభిస్తాయి
- జీవితంలో ఒకసారి మాత్రమే ఇంటి స్థలం లేదా ఇల్లు పొందడానికి అర్హులు
- పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా లబ్దిదారు ఇంటిని నిర్మించుకోవాలి..
- డూప్లికేషన్ లేకుండా ప్లాట్ ను ఆధార్, రేషన్ కార్డులకు లింక్ చేస్తారు..
అర్హులు ఎవరంటే..?
- తెల్లరేషన్ కార్డుదారులు
- రాష్ట్రంలో ఎక్కడా కూడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండకూడదు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి ఇంటి స్ధలం పొందని వారు మాత్రమే అర్హులు
- కేంద్ర, రాష్ట్ర పభుత్వాల హౌసింగ్ స్కీంలలో లబ్దిపొంది ఉండకూడదు
- 5 ఎకరాలు మించి వ్యవసాయ భూమి మెట్ట, రెండున్నర ఎకరాలు జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉన్న వారు అర్హులు
- ఇప్పటికే ఇంటి స్థలం పొందినా ఇల్లు నిర్మించని వారికి ఆ సైట్ రద్దు చేసి వేరే చోట సైట్ కేటాయిస్తారు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
- గ్రామ, వార్డు సచివాలయల్లో దరఖాస్తు చేసుకోవాలి
- దరఖాస్తును వీఆర్వో, ఆర్ఐల ద్వారా విచారణ
- సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శన, అభ్యంతరాలు స్వీకరణ