మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్ -19 మహిళల టీ20(U-19 T20 World Cup) ప్రపంచకప్ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాల మిన్నంటాయి. మహిళల యువ జట్టుకు సామాన్యుల నుంచి ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రపంచ వేదికపై భారత్ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారని ఉప్పొంగిపోతున్నారు. తాజాగా ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఎక్స్ వేదికగా స్పందించారు.
“ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్-2025లో విజేతలుగా నిలిచినందుకు భారత జట్టుకు అభినందనలు. అద్భుతమైన సమష్టి కృషి, పట్టుదల, దృఢసంకల్పం ఫలితమే ఈ విజయం. ఔత్సాహిక క్రీడాకారులకు ఈ గెలుపు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. భారత అమ్మాయిల జట్టు భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు.