తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ(BJP) పావులు కదుపుతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టే దిశా అడుగులు వేస్తోంది. ఈమేరకు పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే రాష్ట్ర నూతన అధ్యక్షుడిని ప్రకటించనుంది. పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీల అధ్యక్షుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ముందుగా రాష్ట్రంలోని 25 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు అధికారిక జాబితాను విడుదల చేసింది. ఏకాభిప్రాయం కుదరని మరో 13 జిల్లాల అధ్యక్షుల నియామకాన్ని పెండింగ్లో పెట్టింది. కొన్ని రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేయడంతో పాటు పార్టీ క్యాడర్ అభిప్రాయాలు తీసుకుని అధ్యక్షులను ఎంపిక చేసినట్లు తెలిపింది.
జనగామ – సౌడ రమేశ్ , వరంగల్ – గంట రవి, హనుమకొండ – సంతోష్రెడ్డి, భూపాలపల్లి – నిశిధర్రెడ్డి, నల్గొండ- నాగం వర్షిత్ రెడ్డి, నిజామాబాద్ – దినేష్ కులాచారి, వనపర్తి- నారాయణ, హైదరాబాద్ సెంట్రల్ – దీపక్రెడ్డి, సికింద్రాబాద్ – మహంకాళి భరత్ గౌడ్, మేడ్చల్ రూరల్ – శ్రీనివాస్, ఆసిఫాబాద్- శ్రీశైలం ముదిరాజ్, కామారెడ్డి – నీలం చిన్నరాజులు, ములుగు – బలరాం, మహబూబ్నగర్ – శ్రీనివాస్రెడ్డి, జగిత్యాల – యాదగిరిబాబు, మంచిర్యాల – వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దపల్లి – సంజీవరెడ్డి , ఆదిలాబాద్ – బ్రహ్మానందరెడ్డి పేర్లను వెల్లడించింది.
ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా వేరొకరికి అవకాశం ఇవ్వాలని పార్టీ ఆధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే వారంలోనే రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి వచ్చే అవకాశం ఉంది.