తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police)లో వరుసగా పోలీసులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కొందరు ఎస్సైలు తమ సర్వీసు తుపాకీలతో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరికొంతమంది కానిస్టేబుళ్లు పనిఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. ఇదిలా ఉండగానే ఇద్దరు పోలీసులు వివిధ కారణాలతో కన్నుమూయడం పోలీస్ శాఖలో మరింత విషాదం మిగిల్చింది.
మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-2గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామను క్వార్టర్స్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చి కన్నుమూశారు. ఆయన స్వస్థలం ఉట్నూర్ మండలం, ఎందా గ్రామం. ఎప్పుడు చురుగ్గా ఉండే ఆయన హఠాన్మరణం తోటి ఉద్యోగుల్లో తీవ్ర విషాదం నింపింది.
ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎస్ఐ శ్వేత తీవ్ర గాయాలతో స్పాట్లోనే మృతి చెందింది. ప్రస్తుతం జగిత్యాల హెడ్క్వార్టర్స్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్వేత.. గతంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఈ రెండు ఘటనలు పోలీస్ శాఖతో పాటు వారి కుటుంబసభ్యుల్లో విషాదాన్ని నింపాయి. ఇరు కుటుంబసభ్యులకు పోలీస్ శాఖ సంతాపం తెలిపింది.