పవన్ కళ్యాణ్ నటించిన కొమురం పులి, మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాల నిర్మాత సింగనమల రమేష్.. దాదాపు 15 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. గతంలో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోవడం, ఓ కేసులో జైలుకు వెళ్లడం వంటి కారణాలతో సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
“15 ఏళ్ల క్రితం ఆరు నుంచి తొమ్మిది నెలల్లో సినిమాలు అయిపోతాయి. కానీ కొమురం పులి సినిమా మూడేళ్లు పట్టింది. మూడేళ్లు మెయింటెన్స్ చాలా ఖర్చులు పెరిగాయి. నాకు కొమురం పులి, ఖలేజా రెండు సినిమాలక కలిపి రూ.100 కోట్ల నష్టం వచ్చింది. హీరోలు కనీసం అయ్యో పాపం అని కూడా అనలేదు. కొమురం పులి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంతో బిజీగా ఉన్నారు అందుకే ఆ సినిమా లేట్ అయింది. ఖలేజాకు కూడా లేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి” అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ వ్యాఖ్యలకు నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) కౌంటర్ ఇచ్చారు. “సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు. మీ కోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ సినిమా చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి. ఇది కరెక్ట్ కాదు” అని ట్వీట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఓ అభిమాని, భక్తుడిగా బండ్ల గణేష్ ముందుంటారని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.