ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది.ఈ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదించిన పలు యూనిట్లకు ఆమోదం తెలుపనున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. భూముల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యమండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపై చర్చ జరగనుంది.
ఈ నెల ఒకటి నుంచి రాష్ట్రంలో పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసే అంశం ఈ సమావేశంలో ముందుకు రానుంది. ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా శాఖ నిర్వహిస్తున్న కొన్ని అధికారాలను కమిషనరేట్ ద్వారా ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రి వర్గం అంగీకారం తెలపనుంది.
స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా అమలు చేయనున్న పీ4 విధానాన్ని ఉగాది నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున కేబినెట్లో చర్చించనున్నారు. 22A, ఫ్రీ హోల్డ్ భూముల అంశంపై మంత్రివర్గానికి స్టేటస్ నోట్ను ఆయా జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు ఇవ్వనున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిట్ విచారణ, సూపర్ సిక్స్లో భాగంగా అమలు చేస్తామని ప్రకటించిన కొన్ని పథకాలపైనా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.