తెలంగాణ(Telangana)కు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం పథకం కింద నిధులు విడుదల చేయనుంది. జాతీయ రోడ్డు రవాణా శాఖ(Road Transport and Highways) ఆధ్వర్యంలోని ఈ పథకం నిర్వహణలో కీలకమైన మైలురాయిలు సాధించినందుకు అదనపు ప్రోత్సాహక సహాయం అందించనుంది. మైలురాయి 1 కింద రూ.125కోట్లు, మైలురాయి 2 కింద రూ.51.5కోట్లకు తెలంగాణ ప్రభుత్వం అర్హత సాధించినట్లు పేర్కొంది.
మైలురాయి 2లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్లు పైబడిన వాహనాలు స్క్రాప్ చేస్తున్న విధానాన్ని ఓ ప్రణాళిక రూపంలో కేంద్రానికి పంపింది. ఈ స్క్రాపింగ్ పథకంతో మరో రూ.75 కోట్లు అర్హత సాధించింది. అలాగే రాష్ట్రంలోని 21 జిల్లాలు ప్రాధాన్యతగా తీసుకుని పనిచేయడం ద్వారా మరో రూ.31.5 కోట్లు అర్హత సాధించింది. ఇలా మొత్తంగా రూ.176.5 కోట్లు కేంద్రం నుంచి అందుకోనుంది. ఈ ఆర్థిక సహాయం రవాణా రంగంలో మరింత అభివృద్ధికి దోహదపడనుంది.