ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) విచారణ ముగిసింది. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో 9 గంటల పాటు విచారణ జరిగింది. సీఐ శ్రీకాంత్ బాబు రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం హయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసిన కేసులో RGVని పోలీసులు విచారించారు. కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్లో పోస్టు చేయడంపై పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో న్యాయవాది సమక్షంలో విచారణ జరిగింది.
అయితే ఈ విషయంలో RGV రెండు రకాలుగా స్పందించారు. మార్ఫింగ్ ఫొటోలను తన ఎక్స్ ఖాతా నుంచే పోస్టు చేసినట్లు విచారణలో ఆర్జీవీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగానే అలా చేశానని వర్మ అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు తనకు ఏమీ గుర్తు లేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే మార్ఫింగ్కు, వైసీపీ నేతలకూ ఎలాంటి సంబంధం లేదని ఒంగోలు పోలీసులకు వర్మ చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో పాటు చంద్రబాబు, లోకేష్, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. దీనితో పాటు ఏపీ ఫైబర్ నెట్ నుంచి రూ.2 కోట్లు ఆర్జీవీకి కేటాయించడంపైనా ఒంగోలు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందించలేదు. ఇక వైసీపీ నేతలతో వ్యక్తిగత పరిచయాలు మాత్రమే ఉన్నాయని ఆర్జీవీ సమాధానం చెప్పినట్లు సమాచారం అందుతోంది.