చిలుకూరు బాలాజీ(Chilukur Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడి ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దేవాలయాల్లో సేవలందిస్తున్న అర్చకులపై దాడి హిందువులపై దాడిగా పరిగణించాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనను బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించగా.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఇది ఒక వ్యక్తిపై కాదు. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని తెలిపారు. ఈమేరకు ఆయన కార్యాలయం ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.
“చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా- ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలి. కొన్ని దశాబ్దాలుగా శ్రీ రంగరాజన్ గారు ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు… పోరాటం చేస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను శ్రీ రంగరాజన్ గారు నాకు అందించారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారు. ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.