చిలుకూరు బాలాజీ ఆలయ(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు రంగరాజన్(Rangarajan)ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆయనపై ఇటీవల జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎమ్మెల్యే కాలె యాదయ్య, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ..రంగరాజన్పై దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. రామరాజ్యం పేరిట హింసాత్మక చర్యలకు పాల్పడితే ఉపేక్షించమని హెచ్చరించారు. చిలుకూరు ఆలయం వద్ద భద్రతను పెంచాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అర్చకులు రంగరాజన్కు ఫోన్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. దాడి జరిగిన తీరుపై ఆరా తీసి ధైర్యంగా ఉండాలని సూచించారు. రామరాజ్యం పేరుతో దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.