రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోంగార్డుల(Home Guards)కు 12 రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈఎంఐలు(EMI) చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) దీనికి ఏ సమాధానం చెబుతారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు పెడుతున్నారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. హోంగార్డులకు వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను” అని తెలిపారు.