ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కొత్త కెప్టెన్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. యువ ఆటగాడు రజత్ పాటిదార్(Rajat Patidar)కు నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీకి కొత్త సారథిగా రజత్ పాటిదార్ ఎంపిక కావడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Kohli) స్పెషల్ వీడియో విడుదల చేశాడు. తామంతా పాటిదార్కు మద్దతుగా నిలుస్తామని తెలిపాడు.
“రజత్ పాటిదార్ ముందుగా నేను నిన్ను అభినందిస్తున్నా. ఈ ఫ్రాంచైజీలో నువ్వు ఎదిగిన విధానం అద్భుతం. జట్టును మెరుగ్గా నడిపిస్తావని ఆశిస్తున్నా. ఇది రజిత్కు దక్కిన గొప్ప గౌరవం. దేశవాళీలో జట్టును నడిపించిన అనుభవం అతడికి ఉంది. కెప్టెన్సీకి నువ్వు అన్ని విధాలా అర్హుడవు. నాతో పాటు జట్టు సభ్యులందరం నీవెంటే ఉంటాం. మా అందరి మద్దతు నీకు ఉంటుంది. అభిమానుల మద్దతూ ఉంటుంది. వచ్చే సీజన్ను రజత్ సారథ్యంలో గొప్పగా ప్రారంభిస్తామని బలంగా విశ్వసిస్తున్నా” అని కోహ్లీ వెల్లడించాడు.