బీర్ పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం నిత్య హోమము, బలిహరణము నిర్వహించి స్వామి వారిని అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంత్రం స్వామి వారి ఉత్సవ మూర్తులను అశ్వం మీద ఆసీనులు చేసి గుర్రపు డెక్క అడవుల్లోకి ఊరేగింపుగా తీసుకువెళ్లి పార్వేట ఉత్సవం నిర్వహించారు. వేటకు వెళ్లే ఈ ఘట్టాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. స్వామివారు కళ్యాణ అనంతరం అమ్మవారితో కలిసి సమీప అడవుల్లోకి వెళ్లి, అక్కడి వనజాతి ప్రజలను వన్య ప్రాణుల నుండి రక్షించడానికి వేటకు వెళ్లి పులిని సంహరించారని ఈ కార్యక్రమం గురించి ఆలయ అర్చకులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వొద్దిపర్తి సంతోషాచార్యులు, మధుకుమారాచార్యులు, చిన్న సంతోషచార్యులు, హేమంత్ ఆచార్యులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం వనమాహోత్సవ కార్యక్రమ ఘట్టాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు, ఆలయ ఈవో తెలిపారు.