Saturday, February 22, 2025
Homeఆంధ్రప్రదేశ్CM CBN: బీసీ విద్యార్ధుల డైట్ బకాయిలు చెల్లించండి

CM CBN: బీసీ విద్యార్ధుల డైట్ బకాయిలు చెల్లించండి

సంక్షేమం కోసం..

బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలతో స్పష్టమైన మార్పులు రావాలని, ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష చేశారు.

- Advertisement -

మార్చ్ కి పూర్తవ్వాలి

రాష్ట్రంలోని 660 గవర్నమెంట్ హాస్టల్స్‌లో రూ.13.10 కోట్లతో చేపట్టిన మరమ్మతులు మరో ఆరు వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు గత ప్రభుత్వం ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటెమ్స్ అందించ లేదని, రూ.18 కోట్లతో వాటి పంపిణీకి చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించగా, ఈ ప్రక్రియ కూడా మార్చి మూడవ వారం నాటికి పూర్తవ్వాలన్నారు.

బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్

పెండింగ్ ట్యూటర్స్ హానరోరియంకు సంబంధించి 485 హాస్టళ్లలో 2024 మార్చి వరకు గత ప్రభుత్వం పెట్టిన రూ.2.02 కోట్ల బకాయిలు, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చెల్లించాల్సి ఉన్న రూ.2.33 కోట్ల బకాయిలు మొత్తం కలిపి రూ.4.35 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా, వెంటనే చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. డైట్ ఛార్జెస్‌కు సంబంధించి రూ.185.27 కోట్లు పెండింగులో ఉన్నాయని అధికారులు వివరించగా ప్రస్తుతం రూ.110.52 కోట్ల చెల్లింపునకు సీఎం అంగీకారం తెలిపారు. కాస్మోటిక్ బిల్లులు రూ.29 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. అలాగే హాస్టళ్ల విద్యుత్ సరఫరాకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా వెంటనే చెల్లించాలని సూచించారు. సత్యసాయి జిల్లాలోని నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ బీసీ గర్ల్స్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. కుప్పంలోనూ బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు

బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేబినెట్లో కూడా ఆమోదం తెలిపామని, ఈ మేరకు అవసరమైతే న్యాయపోరాటం చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ప్రతి కార్పొరేషన్‌కు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, దీనిపై ఇప్పటికే విధివిధానాలు రూపొందించామని తెలిపారు. రజకులకు మేలు చేకూరేలా రాష్ట్రంలో 2014-19 మధ్య నిర్మించిన దోబీ ఘాట్ల మరమ్మతులు, అవసరమైన చోట కొత్తవి నిర్మించడంపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. రానున్న బడ్జెట్ లో కేటాయించే నిధులతో రాష్ట్రంలో బీసీ భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 2014 నుంచి బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిపొందిన వారి సమాచారాన్ని సేకరించాలని, వృత్తి ప్రామాణికంగా రుణాలు తీసుకున్న వారు ప్రస్తుతం ఎంతమంది కొనసాగిస్తున్నారో ఆడిట్ చేయాలని ఆదేశించారు.

బీసీలను హత్య చేసిన వారికి శిక్ష పడాలి

వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, వారి హత్యలపైనా విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశం మేనిఫెస్టోలో కూడా పొందుపరిచామని, అవసరమైతే ప్రత్యేక కమిషన్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. బీసీ రక్షణ చట్టాన్ని సబ్ కమిటీ నివేదిక రాగానే అమల్లోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 2014-19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో 13 కాపు భవనాలను మంజూరు చేసింది. అందులో 5 భవనాల నిర్మాణాలను ప్రారంభించగా, గత ప్రభుత్వం నిలిపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేసింది. అవి త్వరలోనే వినియోగంలోకి రానున్నాయని అధికారులు వివరించారు. నిర్మాణంలో ఉన్న 42 కాపు కమ్యూనిటీ హాళ్లు కూడా వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News