Monday, February 24, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: బాబు, జగన్ రైతులను నిండా ముంచారు: షర్మిల

YS Sharmila: బాబు, జగన్ రైతులను నిండా ముంచారు: షర్మిల

ప్రస్తుత సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ రైతులను నిండా ముంచారని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. గత 10 ఏళ్లుగా మాయ మాటలు చెబుతూ అన్నదాతలను మోసం చేశారని మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“లక్షల్లో అప్పులు, రోజుకో బలవన్మరణం. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం. ఇది మన రాష్ట్రంలో రైతుల దీనస్థితి. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులను పట్టించుకొనే దిక్కు లేదు. కాంగ్రెస్ పాలనలో మహానేత YSR సీఎంగా ఉన్నప్పుడు అన్నపూర్ణగా పేరొంది పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపిన రైతులు.. నేడు గిట్టుబాటు లేక అల్లాడుతున్నారు. మిర్చి రైతు విలవిలాడుతుంటే.. కంది రైతు కంట కన్నీరు పెడుతున్నారు. కూరగాయల ధరలకు మార్కెట్ లో రెక్కలొస్తున్నా.. రైతుకు పెట్టుబడి మాత్రం అందక పండిన పంటకు నిప్పు పెట్టుకొనే దీనస్థితి.

ధర లేక దిగాలు పడుతున్న రైతాంగానికి గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు మాయ మాటలు చెప్తూనే ఉన్నాయి. చంద్రబాబు గారు మొదటి 5 ఏళ్లు ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మాట తప్పితే.. జగన్ గారు ఏడాదికి రూ.3 వేల కోట్లతో నిధి అని మోసం చేశారు. ఇద్దరు కలిసి రాష్ట్ర రైతులను నిండా ముంచారు. ధరల స్థిరీకరణ పేరుతో రాజకీయాలు చేశారు తప్పిస్తే రూపాయి ఇచ్చింది లేదు. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యానికి బస్తాకు రూ.1400 మించి ధర అందలేదు. పత్తి ధర రూ.12 వేల నుంచి రూ.6 వేలకు పడిపోయింది. మిర్చి అయితే రూ.23 వేలు అందాల్సిన చోట రూ.11 వేల కంటే ఎక్కువ ధర దక్కలేదు. కంది రూ.10 వేల నుంచి రూ.7 వేలకు మార్కెట్ ధర తగ్గింది.

రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ధరల స్థిరీకరణ నిధిని తక్షణం ఏర్పాటు చేయండి. ఏడాదికి రూ.5 వేల కోట్లు ధరల స్థిరీకరణ కోసం కేటాయించండి. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పిన రూ.20 వేల సహాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం”అని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News