ఉత్తర్ ప్రదేశ్లోని కుంభమేళాకు వెళ్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనలో 18 మంది ప్రాణాలు విడిచారు. రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తులు చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు అసలు కారణం ఏంటన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ప్రయాగ రాజ్ వెళ్లే రైళ్లు రద్దయ్యాయనే వదంతి ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దీనికి తోడు ప్లాట్ఫామ్ మార్పు గందరగోళం కూడా ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
తొక్కిసలాట ఘటనపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టాలని కేంద్రం ఆదేశించింది.
మరోవైపు తొక్కిసలాట ఘటనలో రైల్వే శాఖ, ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ఉందో.. ప్రజల బాధ్యతారాహిత్యం కూడా అంతే ఉందని తెలుస్తోంది. టికెట్లు తీసుకోని వారు పెద్ద సంఖ్యలో లోపలికి చొచ్చుకురావడం.. క్యూ పాటించకపోవడమూ ఈ ప్రమాదానికి దారి తీశాయి. ఇక మహాకుంభమేళాకు విపరీతమైన రద్దీ ఉంటుందని తెలిసీ రైల్వేశాఖ తగినన్ని రైళ్లు ఏర్పాటు చేయలేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఉన్న కొద్ది రైళ్లలో వెళ్లాలని ప్రయాణికులు ఆరాటపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
గత కొన్ని రోజులుగా ప్రయాగ రాజ్కు ఎక్కువ శాతం ప్రయాణికులు వెళ్లడంతో రైళ్లపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రద్దీని నివారించేందుకే రైళ్లను కూడా పెంచామని రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయినా కానీ ఇలాంటి ఘటనలు చేసుకుంటున్నట్లు తెలిపారు. పలు రైళ్లు ఆలస్యం అవ్వడంతో ఆ ప్రయాణికులు.. ప్రయాగ రాజ్ వెళ్లే ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్ఫామ్ పైకి రావడంతో ఇలా తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.