అయ్యప్ప భక్తులకు శబరిమల(Sabarimala) దేవస్థానం శుభవార్త అందించింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ను తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇకపై పవిత్రమైన 18 మెట్లు ఎక్కగానే స్వామివారి దర్శనం లభిస్తుంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు 1989లో ఏర్పాటు చేసిన బ్రిడ్జిని తొలగించే పనులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శబరిమలలో ప్రస్తుతం కుంభమాస పూజలు జరుగుతుండటంతో ఈ నెల 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది.
అనంతరం మార్చి 14న మీనమాస పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నారు. అప్పుడు ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా దారిలోకి నుమతిస్తారు. అక్కడి నుంచి కణిక్కవంచి-నైవేద్య పాత్ర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకుని దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం పదునెట్టాంబడి ఎక్కగానే భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి 500 మీటర్ల దూరం ఉండే ఫ్లై ఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది. దీంతో రెండుమూడు సెకన్లపాటు మాత్రమే స్వామి దర్శనం లభించేది. తాజా మార్పులతో 30 సెకన్ల నుంచి నిమిషం పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఆలయ అధికారుల నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.