ఎస్ఎల్బీసీ లో ప్రమాదం జరగడంలో మానవ తప్పిదం జరగలేదని, ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఏం లేదని, ఆకస్మాత్తుగా సొరంగంలో మట్టి, నీరు చేరడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మెనేజ్మెంట్ సైనిక బృందాల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అడ్డంకులు అధిగమించి ఘటనాస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని. నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

పరీక్షా సమయంలో రాజకీయాలా?
ఇదీ పరీక్ష సమయమని, కానీ బీఆర్ఎస్, బీజేపీ తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ద్వజమెత్తారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందని, సీయం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నామని, నిన్నటి నుంచి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని వివరించారు.

10 మీటర్ల సొరంగం పనులు కూడా పూర్తి చేయని మీరు..
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణ పనులు 2007లో ప్రారంభమయ్యాయని, అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 10 మీటర్ల సొరంగం పనులు కూడా చేయలేకపోయిందని, సాగునీటి ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి, వాటిని పూర్తి చేయలేదని మండిపడ్డారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమైందని, అనుకోకుండా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు.
