ముక్కోటి దేవతలు దివి నుంచి భువికి దిగి వచ్చి, ఈ ప్రాంతంలో విహరించి ఇక్కడి కోనేరులో జలకాలాడి, శివలింగాన్ని ప్రతిష్టించి పూజించి, ముచ్చటగా సంభాషించుకొని, వచ్చివెళ్లే వారని, ముక్కోటి దేవతలు నడయాడిన ఈ ప్రాంతం ముచ్చట్లగా పేరు గాంచిందని పురాణ గాథ.
బేతంచర్ల దగ్గర
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బేతంచెర్ల పట్టణము నుండి డోన్ కు వెళ్లే రహదారిలో హెచ్ కొట్టాల గ్రామ బస్ స్టేజీ నుండి, సుమారు నాలుగు కిలో మీటర్ల దూరంలో ముచ్చట్ల క్షేత్రం ఉన్నది. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఎత్టైన కొండ కోనల నడుమ, పచ్చటి పచ్చిక బయళ్లతో, పారే సెలయేరు ప్రక్కన, పురాతన శైవ దేవాలయం ఉంది.

బ్రహ్మంగారు తపస్సు చేసిన ప్రాంతం
శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈ ముచ్చట్ల ప్రాంతంలో తపస్సు చేశారని, గ్రంధాలు రచించారని, భీమునిపాడు గడివిడి అచ్చమ్మకు హితభోద చేశారని గ్రంధాలలో ఈ ముచ్చట్ల క్షేతం వ్రాయ బడిందని పెద్దల మాట. ఆగస్త్య మహాముని ఈ ఆలయంలో శివ లింగాన్ని ప్రతిష్టించారని గ్రంధాలలో ఉన్నదని వేద పండితుల మాట. నిర్మాణుష్యమైన, అటవీ ప్రాంతమైన ఈ ముచ్చట్ల క్షేత్ర పరిసరాల గుహలలో మునులు తపస్సు ఆచరించే వారని స్థలపురాణం చెబుతోంది.

గోరంట్ల వేణుమాధవ స్వామి గుడి
ఈ ముచ్చట్ల దేవాలయాన్ని సుమారు 600 సంవత్సరాల క్రితం రాజుల ఏలుబడిలో రాళ్లపై అందమైన శిల్ప కళలతో ఎత్తయిన గాలి గోపురం నిర్మించారు. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో ఉన్న శ్రీ గోరంట్ల మాధవ స్వామి దేవాలయ గాలి గోపురం ముచ్చట్ల దేవాలయ గాలి గోపురం ఒకే నమూనాతో రాజుల కాలంలో నిర్మించారని జనం మాట. బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన రెడ్డి గారి సుబ్బమ్మ, శతబ్ధాల క్రితం గాలి గోపురం, ఆలయ పునః నిర్మాణం చేశారు. తర్వాత కాలంలో బేతంచెర్లకు చెందిన రావు బహదూర్ బి.పి.శేషారెడ్డి ముచ్చట్ల దేవాలయము చుట్టూ బలమైన పచ్చబండ రాళ్ళతో, పటిష్టమైన ప్రహరీ గోడను, తేరు, రథశాలను నిర్మించారు. ఈ మహా శివరాత్రికి శ్రీ ముచ్చట్ల క్షేతం రంగు రంగుల విద్యుత్ కాంతులతో ముస్తాబు అవుతున్నది.
