ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) మండిపడ్డారు. సభలో ఆయన మాట్లాడుతూ.. గొడవలు, బూతులకు వైసీపీ కేరాఫ్ అడ్రస్గా మారిందని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లు వైసీపీని తట్టుకుని నిలబడిన చంద్రబాబుకు హ్యాట్సాఫ్ చెప్పారు. సభలో వైసీపీ సభ్యుల తీరు పట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
“వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఎన్డీయే సభ్యులు అసెంబ్లీలో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే.. వివేకా హత్య, చట్టాల ఉల్లంఘన, 250కి పైగా దేవాయాల కూల్చివేతలు, డాక్టర్ సుధాకర్ హత్య, జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలు, సుప్రీంకోర్టు జడ్జిపై లేఖ రాయడం, హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం, పత్రికాధిపతులపై దాడులు, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తుకువస్తున్నాయి. సంఖ్యా బలం ఉందా లేదా అనేది పక్కన పెడితే.. ప్రతి సభ్యుడు సభ నియమాలను పాటించాలి. మనమే రూల్స్ ను బ్రేక్ చేస్తే ప్రజలకు ఏం చెబుదాం? గవర్నర్ కనుక సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు వైసీపీ సభ్యులు ఇలానే గొడవ చేసే ధైర్యం చేయగలరా? ఆయన కళ్లలోకి చూడగలరా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ సభ్యులు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. గవర్నర్ ప్రసంగాన్ని వాళ్లు బహిష్కరించడం బాధాకరం. ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయ పదాలుగా మారారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలను ఉల్లంఘిస్తే ఎలా? అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్లు బయట ఇంకెలా ఉంటారో? అని పవన్ కల్యాణ్ విమర్శించారు.