తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏపీలో ఉత్తరాంధ్ర టీచర్, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతుంది. 16 జిల్లాల పరిధిలోని 1,062 కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 6,84,593మంది ఓటర్లు ఉన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానంలో 22,493 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి 35 మంది పోటీలో ఉన్నారు. టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది. ఇక్కడ 3,14,984 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా బరిలో నిలవగా.. పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు పోటీ ఉన్నారు. ఈ స్థానంలో 3,47,116 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు.
మరోవైపు తెలంగాణలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి వి. నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. నల్గొండ- ఖమ్మం– వరంగల్ టీచర్ నియోజకవర్గం నుంచి 19మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 25,797 మంది ఓటర్లు ఉన్నారు. కరీంనగర్-మెదక్- నిజామాబాద్-అదిలాబాద్ ఉపాధ్యాయ టీచర్ స్థానంలో 15మంది పోటీలో ఉన్నారు.