ముంబైలో ‘కన్నప్ప’(Kannappa) టీజర్ను మేకర్స్ ఆవిష్కరించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, నటుడు, నిర్మాత విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ కన్నప్ప టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ టీజర్ మార్చి 1న అందరి ముందుకు రాబోతోంది. ఇక కలెక్షన్ కింగ్, డాక్టర్ మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విజువల్ వండర్గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మొదటగా కన్నప్ప ఆఫర్ నా వద్దకు వచ్చినప్పుడు రెండు సార్లు తిరస్కరించాను. కానీ భారతీయ సినిమా ప్రపంచంలో శివుడిగా నేను బాగుంటాను అని విష్ణు పెట్టుకున్న నమ్మకమే నన్ను ఈ సినిమా ఒప్పుకునేలా చేసింది. కన్నప్ప కథ చాలా శక్తివంతమైంది. ఎంతో లోతైన ఎమోషన్స్ ఉంటాయి. విజువల్ వండర్గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను’ అని అన్నారు.
విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘కన్నప్ప కేవలం నాకు ఓ ప్రాజెక్ట్.. ఓ సినిమా కాదు.. ఇది నా జీవిత ప్రయాణం. నేను ప్రస్తుతం భారతదేశంలోని అన్ని జ్యోతిర్లింగాలను సందర్శిస్తున్నాను. కన్నప్ప కథతో నాకు ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది. ఇది అచంచలమైన విశ్వాసం, త్యాగానికి సంబంధించిన కథ. ఈ ప్రయాణంలో అక్షయ్ కుమార్, మోహన్లాల్, ప్రభాస్ వంటి దిగ్గజాలు మాతో చేరడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే భక్తి, దైవిక శక్తితో నిండిన ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యక్తికి చేరుతుందని మేము నమ్ముతున్నాం. ఇది సరిహద్దులను దాటి మానవాళి హృదయంతో మాట్లాడే చిత్రం కానుంది’ అని అన్నారు.

దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘అక్షయ్, మోహన్లాల్, ప్రభాస్ వంటి దిగ్గజాలను డైరెక్ట్ చేయడం అద్భుతమైన అనుభవం. వారందరూ చాలా సహకరించారు. వారి పాత్రలు తెరపై అద్భుతం చేయబోతోన్నాయి. ఈ చిత్రం పట్ల విష్ణుకున్న ప్యాషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ అద్భుతమైన కథ ప్రతిఒక్కరి వద్దకు చేరేలా చూసేందుకు మేము కృషి చేస్తున్నాము’ అని అన్నారు.