ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న పోరులో భారత బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఫీల్డర్లు మెరుపు క్యాచ్లు పట్టడంతో టీమిండియా భారీ స్కోరు సాధించలేకపోయింది. గిల్ 2, రోహిత్ 15, కోహ్లీ 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఇక పవర్ ప్లేలో అతి తక్కువ స్కోర్ చేసింది. దీంతో 33 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్తో కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ జోడి తొలుత క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. కుదురుకున్నాక శ్రేయస్ మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరోవైపు అక్షర్ అతడికి చక్కని సహకారం అందించాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని అక్షర్ను ఔట్ చేయడం ద్వారా రచిన్ రవీంద్ర విడగొట్టాడు. అయ్యర్-అక్షర్ జోడి నాలుగో వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
ఇక అక్షర్ ఔటైన తరువాత రాహుల్తో కలిసి అయ్యర్ కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. శతకానికి చేరువైన అతడిని విలియం ఒరూర్కే బోల్తా కొట్టించాడు. ఈ ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ (79) పరుగులు చేయగా, హార్దిక్ (45), అక్షర్ పటేల్ (42) పరుగులతో రాణించారు. మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆడలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీశాడు. కైల్ జామీసన్, విలియం ఒరూర్కే, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర లు తలా ఓ వికెట్ తీశారు.