తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో(MLC Elections) బీజేపీ ఓ స్థానం కైవసం చేసుకుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య(Malka Komaraiah) విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొమురయ్యకు తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్, టీయూటీఎఫ్ మద్దతు పలికాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని పీఆర్టీయూ గెలుచుకుంది. ఈ స్థానం నుంచి యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిపై పీఆర్టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు.
ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యేయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. ఈ స్థానంలో మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 21 టేబుళ్లలో ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఏ అభ్యర్థి అయిన 50 శాతం ఓట్లు సాధిస్తే వారిని విజేతగా ప్రకటించనున్నారు. లేదంటే రెండో ప్రాధాన్యత ఓట్లను సైతం లెక్కించనున్నారు. దీంతో రేపు మధ్యాహ్నం వరకు ఫలితం అధికారికంగా వెలువడనుంది.