సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)ని కర్నూలు జిల్లా ఆదోనీ పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు జైలు నుంచి తరలిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మూడ్రోజుల్లో మూడు పోలీస్ స్టేషన్లకు తిప్పడం ఏంటని ప్రశ్నించారు. 67 ఏళ్ల వయసులో పోసానిని ఆ జైలుకు, ఈ జైలుకు తిప్పి వేధిస్తున్నారని మండిపడ్డారు.
“పోసానిని నిన్ననే రాజంపేట నుంచి నరసరావుపేట తీసుకువచ్చారు. నరసరావుపేట నుంచి గుంటూరు సబ్ జైలుకు తరలించారు. మళ్లీ ఇవాళ ఆదోని అంటున్నారు. 400 కిలోమీటర్లు దూరంలో ఆదోని ఉంది. 67 ఏళ్ల వయసులో పోసాని పట్ల ఈ విధంగా వ్యవహరించడం దుర్మార్గం. గత రాత్రే ఆయనను తీసుకువచ్చారు.. ఇప్పుడు మళ్లీ తీసుకెళుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని వేధింపులకు గురిచేసేందుకు ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.
పోలీస్ వ్యవస్థ, నారా లోకేశ్ కలిసి ఉద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడుతున్నారు. మీడియాలో మాట్లాడినందుకు 16 కేసులు పెట్టారు. ఓ రెండు మూడు నెలలు ఆయనను ఇలా కేసుల పేరిట తిప్పాలన్న దురుద్దేశం కనపడుతోంది. వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్లందరినీ భయపెడుతున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపులపై న్యాయపోరాటం చేస్తాం” అంటూ అంబటి వెల్లడించారు.