ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పందించారు. పవన్ కళ్యాణ్పై జగన్వి దిగజారుడు మాటలని విమర్శించారు. అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని మండిపడ్డారు. అసలు పవన్ కు వచ్చిన మెజారిటీ ఎంత, జగన్కు వచ్చిన మెజారిటీ ఎంత? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా, అధికారం కోల్పోయినా జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారని విమర్శించారు. పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయట అని సెటైర్లు వేశారు.
ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి జగన్ సీఎంను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తనను తల్లి, చెల్లి కూడా నమ్మట్లేదని జగన్ ఇంకా గ్రహించడంలేదు అన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అన్నది ప్రజలే నిర్ణయించారు… ఈ విషయం జగన్ కు ఎందుకు అర్థం కావట్లేదు? అని లోకేశ్ ప్రశ్నించారు. తనకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో జగన్ ఓసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని సూచించారు. ప్రత్యేక హెలికాఫ్టర్లో బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్మీట్ పెట్టారని.. మళ్లీ రెండు రోజుల్లో బెంగళూరుకు వెళ్లిపోతారని తెలిపారు. కాగా పవన్ కల్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.