Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Summer schools: ఒంటిపూట బడులు వచ్చాయి.. పిల్లలూ జాగ్రత్త

Summer schools: ఒంటిపూట బడులు వచ్చాయి.. పిల్లలూ జాగ్రత్త

దాదాపు పది నెలలు రోజంతా పాఠశాలలో గడిపి.. ఎప్పుడెప్పుడు ఒంటిపూట బడులు వస్తాయా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించేసింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉండి విసుకు చెందుతున్న వారికి.. మార్చి 15 బుధవారం నుంచి ఒంటిపూట బడులు నడుపుతూ పిల్లలకు నోరు తీపి చేసింది. ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ ప్రైవేట్‌ పాఠశాలలు బుధవారం నుంచి పనిచేస్తున్నాయి. అయితే మామూలు రోజుల్లో పిల్లలు ఉదయం 8 గంటలకు బడికి వెళ్లి సాయంత్రం నాలుగు తర్వాత ఇంటికి చేరేవారు. వారిని తల్లిదండ్రులు, సంరక్షకులు, ఇంటి పెద్దలు, సంబంధికులు పంపించడం, తీసుకురావడం జరిగేది. మరి దీనికి మారుమూల గ్రామీణ ప్రాంతాలు, పల్లెల్లో ఇది కొంత భిన్నం. ఎందుకంటే అక్కడ పిల్లలే స్వయంగా పాఠశాలకు వెళ్లి, తిరిగొస్తుంటారు. తల్లిదం డ్రులు వ్యవసాయ, కూలీ, తదితరుల పనుల్లో నిమగ్నమై పోతారు.
కడుపు సోకం తప్పదు…
అయితే ఒంటి పూట బడుల వేళ విద్యార్థులు పాఠ శాల నుంచి ఇంటికొచ్చిన అనంతరం వివిధ ఆటలు ఆడటం, స్నేహితులతో కలిసి చెట్లు, పుట్టలు, గట్లు తిరగడం.. అంతేకాకుండా చిన్న నీటి కుంటల నుంచి పెద్ద చెరువులు, వ్యవసాయ బావుల్లో సరదాగా ఈతకు వెళ్లడా నికి సమూకత చూపుతారు. అలాంటి వారిలో ఈత నైపు ణ్యం ఉన్నవారు, ఈత రానివాళ్లూ ఉంటారు. అంతే కాకుండా ఇతరులను చూసి తాను నేర్చుకోవాలనే తాపత్ర యంతో ఉంటారు. కొందరేమో మేమున్నాం కదా ఏం భయపడకు, నీటిలో దూకేసేయ్‌ అని, ఇంకొందరికి ఆసక్తి లేకపోయినా వాళ్లని వెనకాల నుంచి నీటిలో నెట్టి వేయడం వంటివి తోటి మిత్రులు చేస్తారు. ఇటువంటి సందర్భాల్లో ఎంతో మంది చిన్నారులు మృతి చెందిన ఘటనలు చాలా వెలుగు చూశాయి. అదేవిధంగా ఇంటి ఆవరణంలో నీటి తొట్లు, ట్యాంకులు ఉండటం సర్వసాధారణం. ఇంటి వద్ద ఆడుకుంటూ అవి గమనించక వాటి సమీపానికి వెళ్తుం టారు. వాటిపై మూతలు పెట్టకపోవడంతో గాని, ఏదైనా అవసరానికి నీరు తోడే ప్రయత్నంలో అందులో పడి మరణించిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి విషాద ఘట నల్లో 5 నుంచి 20 ఏళ్లలోపు వారు ఎక్కువ ఉంటున్నారు. వారి సరదాకు, తెలిసి తెలియని తప్పిదాలకు ఫలితంగా తల్లిదండ్రులకు కడుపుసోకం తప్పడం లేదు.
కొన్ని విషాద ఘటనలు పరిశీలిస్తే…
ఈ ఏడాది హోళీ పండగ పూట మానేరు వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృతి చెందగా.. మరో బాలుడు గల్లంతయిన విషాదం కరీంనగర్‌ జిల్లాలో జరిగింది. పిల్లలందరూ 14, 15 ఏళ్లు ఉన్నవారే. ఏపీలోని కృష్ణా జిల్లాలో గత సంవత్సరం డిసెంబర్‌లో యనమల కుదురు సమీపంలోని కృష్ణా నదిలో సరదగా ఈతకి వెళ్లి గల్లంతైన ఐదుగురు విద్యార్థులు చనిపోయారు. ఉత్తరా ఖండ్‌ చమోలి జిల్లా థరాలి తాలుకాలో పోయిన ఏడాది నవంబర్‌లో కాళీ నదిలోకి ఈతకు వెళ్లిన నలుగురు బాలురు మృతి చెందారు. ఆ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోయిన సెప్టెంబర్‌లో మేడ్చల్‌ జిల్లా కీసర పరిధిలోని నాట్కమ్‌ చెరువులో గల్లంతై విద్యార్థులు చనిపోయారు. పుట్టినరోజు వేడుకకు చీర్యాల లక్ష్మీనర సింహస్వామి గుడికి వచ్చిన 10మంది స్నేహితుల్లో ముగ్గురు చెరువులోకి దిగారు. ఈత రాక ఒక్కొక్కరుగా మునిగారు. దైవదర్శనానికి వస్తే ముగ్గురు చనిపోవడం తీవ్రంగా కలచివేసింది.
మే 2022లో మహారాష్ట్రలోని భాట్ఘర్‌ జలాశయం బ్యాక్‌ వాటర్‌లో ఈతకెళ్లి ఐదుగురు మహిళలు చని పోయారు. పుణె జిల్లాలో ఖేడ్‌ తహసీల్‌లోని చాస్కమాన్‌ డ్యామ్‌లో ఈత కోసం వెళ్లి నలుగురు 10 తరగతి విద్యా ర్థులు నీట మునిగారు. ఫిబ్రవరి 2020లో నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలం జి.కె.తండాలో ఇంటి ముందు ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. అదే ఏడాది మార్చిలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కావడిగుండ్లలో రెండేళ్ల చిన్నారి ఇంటి ఆవ రణలో ఆడుకుంటూ నీటి ట్యాంక్‌ వద్దకు వెళ్లగా ప్రమాదవ శాత్తు అందులో పడి చనిపోయింది. 2019లో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ముచ్చర్లలో ఓ ఇంట్లో పాప తల్లి ఇంట్లోనే ఉన్నా.. ఏమరపాటు నిర్లక్ష్యంతో పాపను సరిగ్గా గమనించలేదు. ఆడుకుంటూ వెళ్లిన పాప బాత్రూం లోని నిండు తొట్టిలో పడి చనిపోయింది.
బాధ్యతగా కనిపెడుతూ…
పాఠశాల విడిచిన అనంతరం పిల్లలు ఆడుకునే సమయాల్లో, ఈతకు వెళ్లే సందర్భాల్లో కుటుంబీకులు, సంరక్షకులు, ఇరుగుపొరుగువారు వారిని బాధ్యతగా కనిపెడు తుండాలి. వాళ్ల కదిలికలను గమనిస్తూ మంచి, చెడు, అపాయాల గురించి చెప్పాలి. ఆటలు ఆడించడం, ఈత నేర్పటం వంటివి స్వయంగా సంబంధికుల పర్యవేక్షణలో జరిగితే ఎలాంటి ప్రమాదాలకు తావుండదు. తల్లిదం డ్రులు, ఇతరులకు చెప్పకుండా బయట తిరిగే పిల్లల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వాళ్లను దారిలోకి తీసుకురావాలి. మానసిక స్థితికి అనుగుణంగా మాటలు, చేతల ద్వారా గాడిలో పెట్టాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలను ఒంటి పూట బడులప్పుడు, వేసవిలో, ఇతర సమయాల్లోనూ వివిధ అనర్ధాలు, ప్రమాదాలు, అపాయాల భారి నుంచి వారిని రక్షించుకోగలం.

తలారి గణేష్‌
జర్నలిస్టు, సామాజిక కార్యకర్త
9948026058

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News