హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్లో అరాచకం సృష్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
“అధికారం కోసం ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెబుతారు. అధికారం దక్కిన తర్వాత ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారు. హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్లో అరాచకం సృష్టిస్తున్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో పేదల ఇళ్లను కూల్చివేశారు. ఇలాంటి చర్యల వల్ల రిజిస్ట్రేషన్లు పాతాళానికి పడిపోయాయి” అని విమర్శించారు.
“ఆదాయం అడుగంటి పోయింది, ఖజానా ఖాళీ అయింది. కాంగ్రెస్ పాలనలో లక్షన్నర కోట్ల అప్పులు అయ్యాయి. కానీ హామీల అమలు మాత్రం గాల్లో కలిసిపోయింది. కాంగ్రెస్ 15 నెలల పాలన నిర్వాకం మూలంగా రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గారడిలో సామాన్యులు సమిధలుగా మారారు. జాగో తెలంగాణ జాగో” అని తెలిపారు.