ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో.. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో లీగ్ దశలో అద్భుతంగా రాణించి టీమిండియా.. ఫైనల్ కు చేసింది. మరోవైపు వరుసగా మూడో సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరింది భారత్. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఇది నిలిచింది. 2013లో టైటిల్ సొంతం చేసుకోగా, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది.
ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-న్యూజిలాండ్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఫైనల్కు చేరగా.. దక్షిణాఫ్రికాను ఓడించి కివీస్ ఫైనల్ కు వచ్చింది. న్యూజిలాండ్ జట్టు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకోవడం ఇది మూడోసారి. అయితే ఐసీసీ నాకౌట్ దశల్లో రెండు జట్ల మధ్య గత రికార్డులు న్యూజిలాండ్కు అన్ని ఫార్మాట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని ఇస్తున్నాయి.
నాలుగు సందర్భాల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు నాకౌట్ మ్యాచ్ల్లో తలపడ్డాయి. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019, 2023 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్స్, 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ల్లో భారత్, న్యూజిలాండ్లు జట్లు ఢీకొన్నాయి. ఇందులో 2023 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మినహా మిగిలిన మూడు సందర్భాల్లో భారత్ ఓడిపోయింది. దీంతో నాకౌట్ మ్యాచ్ల్లో కివీస్ 3-1 ఆధిక్యంలో నిలిచింది.
2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ను ఓడించి తొలిసారి ఐసీసీ టైటిల్ను ముద్దాడింది న్యూజిలాండ్. ఇక యాదృచ్చికంగా 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ను ఓడించి రెండో ఐసీసీ టోర్నీని గెలుచుకుంది. మరోవైపు ఆదివారం టైటిల్ పోరులో న్యూజిలాండ్ను ఓడించిన వెంటనే భారత జట్టు చారిత్రాత్మక ఘనతను సాధిస్తుంది. ఇది భారతదేశానికి మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ అవుతుంది.
ఈ ఐసీసీ ఈవెంట్ను మూడుసార్లు గెలుచుకున్న ప్రపంచంలోనే తొలి జట్టుగా టీమిండియా నిలుస్తుంది. భారత జట్టు 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలవగా.. ఆ తర్వాత ధోని నాయకత్వంలో 2013 లో ట్రోఫీని అందుకుంది. ఇప్పటివరకు టోర్నమెంట్లో అత్యంత విజయవంతమైన జట్లు ఆస్ట్రేలియా, భారత్ మాత్రమే.. ఈ రెండు జట్లు చెరో రెండు టైటిళ్లను సొంతం చేసుకున్నాయి.