నేచురల్ స్టార్ నాని సమర్పణలో ‘కోర్ట్’(Court) మూవీ తెరకెక్కింది. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, తదితరులు కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ప్రియదర్శి(Priyadarshi) ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘బలగం’ కంటే ముందు ‘గేమ్ ఛేంజర్’(Game Chanager) చిత్రాన్ని ఒప్పుకొన్నానని ప్రియదర్శి తెలిపారు. ఆ మూవీని ఎప్పుడు ప్రకటించారో.. ఎప్పుడు పూర్తయిందో.. అందరికీ తెలుసన్నారు. ఈ మూవీ కోసం 25 రోజులు పనిచేశానని.. కానీ మూవీలో 2 నిమిషాలు కూడా కనిపించనని తెలిపారు. తాను చేసిన చాలా సీన్స్ ఎడిటింగ్లో తీసేశారని చెప్పారు. అయితే శంకర్, రామ్చరణ్, తిరుతో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉందని.. ఆ కల నెరవేరిందన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని.. కానీ కుదరడం లేదన్నారు. ‘ఆచార్య’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల్లో ఛాన్స్ దొరకలేదన్నారు.