మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య(Harirama Jogaiah) సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు మరోసారి బహిరంగ లేఖ రాశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సుమారు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాయని.. మరో రూ.50 వేల కోట్లు ఖర్చు చేయడనికి కూడా సిద్ధం అవుతున్నాయని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆఫీసులు, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు వంటి నిర్మాణాల కోసం ఖర్చు చేయడం మంచిదే. అన్నారు. అయితే మిగతా వాటి సంగతి ఏంటి? అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ వారాహి సభలో ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటూనన్నారని గుర్తు చేశారు. మరి గోదావరి జిల్లాల అభివృద్ధికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. విద్య, వైద్యం, రోడ్లు, రవాణా, వ్యాపార, వ్యవసాయ, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, ఓడరేవులు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. ఏళ్ల తరబడి సమగ్ర అభివృద్ధికి నోచుకోని గోదావరి జిల్లాలకు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి పథకాలకు.. ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.