తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), శాసనమండలిలో ఐటీ మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. రూ.3లక్షల కోట్లకు పైగానే బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఈసారి రూ.3 లక్షల కోట్లు దాటే అవకాశముందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో భట్టి చర్చలు జరిపారు. ఏ శాఖకు ఎంత కేటాయించాలనే దానిపై స్పష్టతకు వచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు పెద్దఎత్తున ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశముంది. అలాగే వ్యవసాయం, నీటిపారుదల, విద్య, రోడ్లు-భవనాలు, ఇంధన శాఖ, గృహనిర్మాణం వంటి రంగాలకు అధికంగా నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖకు నిధులు కేటాయించనున్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు ఇంధన శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉంది.ఇక కొత్తగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలల కోసం విద్యాశాఖకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
కాగా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత, లోక్సభ ఎన్నికల కారణంగా 2024 ఫిబ్రవరిలో మూడు నెలల కాలానికి ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అనంతరం 2024 జులై 25న మిగిలిన తొమ్మిది నెలల కోసం రూ.2.90 లక్షల కోట్లతో పూర్తి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రభుత్వం సమర్పించనుంది.