తెలంగాణ బడ్జెట్(Telangana Budget)పై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఈరోజు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి తగిన మేరకు కేటాయింపులు చేయడం హర్షణీయమని కొనియాడారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్కకి, శాసనమండలిలో ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబుకి అభినందనలు చెప్పారు.
ఈ బడ్జెట్ సమ్మిళిత వృద్ధిని ప్రతిబింబింబిస్తుందని భావిస్తున్నానని తెలిపారు. ఒకవైపు అభివృద్ధి… మరోవైపు సంక్షేమాన్ని సమతుల్యత చేస్తూ బడ్జెట్ దిశానిర్ధేశం చేసేలా ఉందన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఉందని… ఉపాధి కల్పనకు ఊతం ఇస్తూ… మహిళా సంక్షేమం, యువత, దళితులు, గిరిజనుల సంక్షేమానికి దిక్సూచీలా ఉందని ఆమె పేర్కొన్నారు. యావత్ తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలకు అద్దంపట్టేలా బడ్జెట్ను రూపొందించడం ప్రశంసనీయమన్నారు. సవాళ్ళపై స్వారీ చేస్తూనే… రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజల ఆర్ధిక స్ధిరత్వానికి బాటలు వేస్తుందన్నారు.