తెలంగాణ బడ్జెట్(Telangana Budget) అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. ప్రజా రంజక బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ధన్యవాదాలు చెప్పారు. తమ ప్రభుత్వంలో విద్యా, వైద్యం , పరిశ్రమల ప్రోత్సాహానికి,మహిళా ఆర్థిక వృద్ధి , సంక్షేమానికి పెద్ద పేట వేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలను పెంచడానికి ఇటీవల ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రత్యేక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. రైతు భరోసా ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సన్న వడ్లకు బోనస్ నిధులు కేటాయించి తమది రైతు ప్రభుత్వంగా మరోసారి నిరూపించుకుందన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయింపు జరిగిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించడానికి ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి భారీగా నిధులు కేటాయించిందన్నారు. అధునాతన సాంకేతిక శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్యాలను పెంపొందిస్తామన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. గిరిజనాభివృద్ది కోసం రాష్ట్రంలో మొదటిసారిగా ఇందిరా గిరి జల వికాసం ప్రత్యేక పథకం ప్రారంభించడం అభినందనీయమన్నారు.
ఇక MSMEల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించడం వల్ల పారిశ్రామికంగ మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మొదటిసారి నూతన టూరిజం పాలసీ అమలులోకి తేవడం వల్ల రాష్ట్రంలో మరింత పర్యాటకం అభివృద్ది చెందుతుందని చెప్పుకొచ్చారు. సినిమా రంగాల వారికి గద్దర్ అవార్డులు ప్రకటించడం గద్దర్ అన్ననీ గౌరవించుకోవడమే అన్నారు. హోంగార్డులకు రోజు వేతనాలను పెంచి వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మిత్ర యాప్ ద్వారా డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించడం అభినందనీయమని పొన్నం వెల్లడించారు.