రాజమహేంద్రవరం శివారులో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్(Paster Praveen Kumar) మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Chandrababu) విచారం వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీతో మాట్లాడిన ముఖ్యమంత్రి అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. మరోవైపు పాస్టర్ మృతిపై వస్తున్న ఆరోపణలపై హోంమంత్రి అనిత స్పందించారు.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజీ పరిశీలించాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఈ ఘటనలో పాస్టర్ మృతి చెందినట్లు రాజానగరం సీఐ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ మంగళవారం తెలిపారు.
హైదరాబాదు నుంచి బుల్లెట్ పై సోమవారం రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్ కుమార్ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురైయ్యారని తెలిపారు. రహదారిపై నుంచి దిగువకు ప్రమాదవశాత్తు జారిపోయారని వాహనం అతనిపై పడిపోవడంతో బలమైన గాయాలు కావటంతో ప్రవీణ్ మృతి చెందారని తెలిపారు.
మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఎవరు గమనించలేదని తెలిపారు. ప్రవీణ్ కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు.