Virat Kohli : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు సెమీస్లోనే ఓడి ఇంటిముఖం పట్టింది. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 98.66 సగటుతో 296 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. ప్రస్తుతం టీమ్ఇండియా కివీస్ పర్యటనలో ఉంది. అయితే.. తీరిక లేని క్రికెట్ ఆడుతుండడంతో విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు.
దీంతో విరాట్ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్నాడు. అలాగే సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో విరాట్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. 2022 అక్టోబర్ 23 తనకు ప్రత్యేకమైన రోజు అని చెప్పాడు. ఆ రోజును తన జీవితంలో ఎన్నటికి మరిచిపోలేని రోజుగా అభివర్ణించాడు.
నిజమే ఆ రోజును విరాట్ మాత్రమే కాకుండా సగటు భారత అభిమాని కూడా ఎన్నటికి మరిచిపోడు. ఆసీస్ వేదికగా గ్రూప్ స్టేజ్లో భారత్ తన తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్తో తలపడిన రోజు అది. ఆ రోజు విరాట్ శివాలెత్తాడు. రోహిత్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తిక్ లు విఫలమైన చోట హార్థిక్ పాండ్య సాయంతో కడవరకు నిలిచి 82 పరుగుల అభేధ్యమైన ఇన్నింగ్స్తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు కింగ్ కోహ్లీ.
ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ.. “అక్టోబర్ 23 తేదీకి నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం. ఎన్నో మ్యాచ్లు ఆడినప్పటికీ ఆ రోజు ఉన్నంత ఎనర్జీ ఇంకా ఏ రోజు లేదు. నిజంగా ఆ సాయంత్రం ఓ అద్భుతం” అని ఇన్స్టాగ్రామ్లో విరాట్ రాసుకొచ్చాడు. విజయం సాధించిన తరువాత మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్కి వెలుతున్న ఫోటోను షేర్ చేశాడు.
ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. విరాట్ అద్భుత ఇన్నింగ్స్కు హార్థిక్ పాండ్య(40) సహకారం కూడా తోడు కావడంతో భారత్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.