తాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు విశ్వాసమైన కుక్కలా ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy)తెలిపారు. తనను బొచ్చు కుక్క అని విమర్శించిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవాల్లో భాగంగా ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలు, నాయకులను కాపాడుకునేందుకు కాపలా కుక్కలా పనిచేస్తానని తెలిపారు. అలవిగాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడంలో, ప్రజల భూములను కాపాడటంలో రేసు కుక్కలా పోరాడతానని చెప్పారు. “అవును నేను కుక్కనే.. నన్ను నమ్మిన కేసీఆర్కు విశ్వాసమైన కుక్కలా ఉంటానని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అంతేకానీ ఒక పార్టీలో గెలిచి అధికారం కోసం మరో పార్టీలోకి దుంకే నీలాంటి గుంట నక్కను మాత్రం కాదు” అని పల్లా ధ్వజమెత్తారు.