పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణమోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ (Mehul Choksi) బెల్జియం దేశంలో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. చోక్సీ అరెస్ట్పై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. చోక్సీ అరెస్ట్ భారత్కు పెద్ద విజయం అని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) తెలిపారు. పేదల సొమ్ము దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. పేదల డబ్బును దోచుకున్న వారు ఎవరైనా సరే ఆ సొమ్మును తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500కోట్ల రుణ మోసం కేసులో మెహుల్ చోక్సీ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియంలో నివాసం ఉంటున్నారు. చోక్సీని భారత్కు రప్పించేందుకు సీబీఐతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీబీఐ విజ్ఞప్తి మేరకు ఆయనను శనివారం అరెస్టు చేసినట్లు ఆ దేశ మీడియా తెలిపింది.