సొంత పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వార్నింగ్ ఇచ్చారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగించాలని ఎవరైనా చూస్తే వారే ఇబ్బంది పడతారని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని గుర్తించాలని హితవు పలికారు.
మంత్రి వర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరేమి మాట్లాడినా ఉపయోగం ఉండదని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేలు రేపటి నుంచి గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. తాను కూడా మే ఒకటో తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్తానని పేర్కొన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విమర్శలు చేసేవారని.. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పథకాలతో మోదీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందని రేవంత్ వెల్లడించారు.