ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రమాదం నుంచి చిన్నారి సురక్షితంగా బయటపడటంతో పవన్ భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ఆమె తలనీలాలు సమర్పించడంపై సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. సనాతన ధర్మంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరికాదని అంటున్నారు.
తాజాగా ఈ ట్రోల్స్పై సీనియర్ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(Vijayashanthi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు” అని పేర్కొన్నారు.