వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి(Peddireddy Ramachandra Reddy)దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం తిరుపతిలో ఉద్రిక్తతకు దారి తీసింది. తిరుపతి రాయల్ నగర్ ప్రాంతంలోని బుగ్గమఠం స్థలాన్ని పెద్దిరెడ్డి ఆక్రమించారంటూ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. దీంతో వారం రోజుల్లో ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని పెద్దిరెడ్డికి ఈ నెల 11న నోటీసులు జారీ చేశారు. అయితే పెద్దిరెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన ఆక్రమించుకున్న స్థలంలో కొలతలు చేపట్టేందుకు ప్రయత్నం చేశారు. కానీ అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాగా తిరుపతి బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించారంటూ గతంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. తన ఇంటి కోసం బుగ్గమఠం స్థలంలో అక్రమంగా రోడ్డు నిర్మించి గేటు నిర్మాణం చేపట్టారని స్థానికుల ఫిర్యాదుతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. పెద్దిరెడ్డి ఏర్పాటు చేసిన రోడ్డు, గేటును తీసివేశారు.