మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు దక్కించుకున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం, ప్రతిపక్షాల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పే నేత. అలాంటి వ్యక్తి చిన్న పిల్లాడిలా కంటతడి పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సిద్దిపేటలో ‘విద్యార్థుల కోసం భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి’ అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాటలకు ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఓ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయారని తల్లి కష్టపడి తనను చదివిస్తోందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలు విన్న హరీశ్రావు బాలికను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని చిన్నారిని ఓదార్చారు.