ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కించపరిచేలా అధికార పార్టీ ప్రవర్తన ఉందంటూ, గూండాయిజంతో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 98 డివిజన్లలో 58 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందని గుర్తుచేశారు జగన్. అదే సమయంలో టీడీపీ కేవలం 30 సీట్లకే పరిమితమైందన్నారు. అప్పుడు మేయర్ పదవి అధికార కూటమికి ఎలా వస్తుందని ప్రశ్నించారు. ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చినప్పటికీ.. బెదిరింపులు, ప్రలోభాల ద్వారా బీసీ మహిళ అయిన మేయర్ను పదవి నుంచి దించడం దుర్మార్గమైన రాజకీయం అని విమర్శించారు.
బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, యాదవ కులానికి చెందిన మహిళను మేయర్గా నియమించామని, అలాంటి వ్యక్తిని కోట్లాది రూపాయల ఆశగా చూపిస్తూ అవిశ్వాసంతో తొలగించడం కూటమి ప్రభుత్వ రాజకీయ నీచతనానికి నిదర్శనమన్నారు. ఇది ప్రజాస్వామ్యమా అన్న జగన్.. ఇలా జరిగే అవిశ్వాసం ప్రక్రియను స్వేచ్ఛా విధిగా జరిగినదిగా ఎలా చెప్పుకోవాలని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జరుగుతున్న ఈ కుట్రలు అధికార దుర్వినియోగం కాదా అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.